మూడో మేయర్‌ సునీల్‌రావు

9 Feb, 2020 10:33 IST|Sakshi

నేడు బాధ్యతల స్వీకరణ

ఏర్పాట్లు చేసిన కార్పొరేషన్‌ అధికారులు

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించి మేయర్‌ పీఠం కైవసం చేసుకుంది. మేయర్‌గా సునీల్‌రావు, డెప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపరాణిని ఎన్నుకున్నారు. మేయర్‌గా సునీల్‌రావు శనివారం బాధ్యతలను స్వీకరించనున్నారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు కార్పొరేషన్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  

ఐదోసారి కార్పొరేటర్‌.. మూడో మేయర్‌
సునీల్‌రావు(52) భార్య అపర్ణ మాజీ కార్పొరేటర్‌. వీరికి కుమారుడు ప్రద్యుమ్నరావు, కూతురు స్వప్నిక ఉన్నారు. 1987లో నగర కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1992లో జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ, 1995 నుంచి 2001 వరకూ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్, 2001 నుంచి 2005 వరకూ కాంగ్రెస్‌ నుంచి మున్సిపల్‌ కౌన్సిలర్, 2005 నుంచి 2010 కాంగ్రెస్‌ మున్సిపల్‌ కార్పొరేటర్‌గా, 2005 నుంచి 2009 వరకూ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. 2014 మున్సిపల్‌ ఎన్నికల్లో సునీల్‌రావు కాంగ్రెస్‌ తరఫున, ఆయన భార్య అపర్ణ ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. తర్వాత కొద్ది రోజులకే ఇద్దరూ     టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 నుంచి టీఆర్‌ఎస్‌లో చురుకైనా     పాత్ర పోషిస్తున్నారు. 2020లో జరిగిన తాజా కార్పొరేషన్‌ ఎన్నికల్లో 33వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా 1997 ఓట్ల భారీ మోజారిటీతో విజయం సాధించారు. కరీంనగర్‌ తొలి మేయర్‌గా కాంగ్రెస్‌ పార్టీ నుంచి డి.శంకర్‌ ఎన్నికయ్యారు. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి రవీందర్‌ సింగ్‌ మేయర్‌గా ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు