జడ్జీలను నియమించకపోవడం.. హక్కుల ఉల్లంఘనే

10 Apr, 2016 01:08 IST|Sakshi
జడ్జీలను నియమించకపోవడం.. హక్కుల ఉల్లంఘనే

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్
న్యాయం అందుబాటులో ఉండడం ప్రజల ప్రాథమిక హక్కు
న్యాయ నియామకాల కమిషన్ వివాదంతో జడ్జీల భర్తీ ఆగింది
న్యాయమూర్తుల నియామకాలను సత్వరం చేపట్టాలి
అసంఘటిత రంగ కార్మికులకు, పేదలకు న్యాయం అందాలి
లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచన
న్యాయసేవా సాధికార సంస్థల 14వ జాతీయ సదస్సు
హాజరైన కేంద్ర మంత్రి సదానంద గౌడ, సీఎం కేసీఆర్,
జస్టిస్ దవే, జస్టిస్ రమణ, జస్టిస్ బొసాలే



న్యాయం అందుబాటులో ఉండడం ప్రజల ప్రాథమిక హక్కు అని, జడ్జీల పోస్టుల భర్తీలో ఆలస్యం కారణంగా ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యంతో న్యాయవ్యవస్థలపై కేసుల భారం పెరుగుతోందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఏర్పాటు చేసిన న్యాయసేవా సాధికార సంస్థల 14వ జాతీయ సదస్సుకు జస్టిస్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు వివాదంతో ఏడాది పాటు న్యాయ నియామకాలు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు.

దాంతో దేశవ్యాప్తంగా 450 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ ఏడాది చివరి నాటికి మరో 50 ఖాళీలు ఏర్పడుతాయని చెప్పారు. 90 మంది శాశ్వత న్యాయమూర్తులు, 40 మంది కొత్త జడ్జీల నియామకాలకు మార్గం సుగమమైందని... వారి నియామకాల ప్రక్రియను త్వరగా పూర్తిచేసేందుకు న్యాయశాఖ మంత్రి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మరో 130 నియామకాల కోసం అర్హులైన న్యాయవాదుల పేర్లు సిఫార్సు చేశామన్నారు. సగటు పౌరుడికి న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింతగా పెంపొందించాలని పిలుపునిచ్చారు.
 
 ఉచిత న్యాయ సహాయం అందాలి..: దేశంలోని 46 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల్లో 14 కోట్ల మంది మహిళలు ఉన్నారని.. అలాగే 40 కోట్ల మంది పేదలు ఉన్నారని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. వారందరికీ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయసేవా సాధికార సంస్థలపై ఉందని స్పష్టం చేశారు. వారి సంక్షేమం కోసం పనిచేసే యూనియన్లు లేవన్నారు. డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసేవారు, దాబాలు, హోటళ్లలో పనిచేసే వెయిటర్లు ఇలా కోట్లాది మంది కార్మికులు శ్రమదోపిడీకి గురికాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవాదులదేనని చెప్పారు. న్యాయసేవా సాధికార సంస్థ ఏర్పాటు చేసే న్యాయవాదులు అనుభవం లేని వారనే అపోహ ఉందని... సమర్థులైన న్యాయవాదులను నియమించి ఆ అపోహను పోగొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. లోక్ అదాలత్‌లు పేదల కోసం మాత్రమే కాదని, ధనవంతులకు కూడా అవి ఉపయుక్తంగా ఉంటాయని స్పష్టం చేశారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 1947లో జనాభా 30 కోట్లు ఉంటే ప్రస్తుతం 130 కోట్లు ఉందని, అప్పుడు పేదల సంఖ్య 10 కోట్లు ఉంటే ఇప్పుడు 40 కోట్లకు పెరిగిందన్నారు.

భారం తగ్గించాం: జస్టిస్ అనిల్ రమేశ్ దవే
లోక్‌అదాలత్‌ల ద్వారా దేశవ్యాప్తంగా 62 లక్షల పెండింగ్ కేసులను, 1.61 కోట్ల ప్రీలిటిగేషన్ (పోలీసు విచారణ దశలో ఉన్న) కేసులను పరిష్కరించి కోర్టులపై భారాన్ని తగ్గించామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ రమేష్ దవే చెప్పారు. లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలు సంతోషంగా ఉంటాయన్నారు. మనుషుల అక్రమ రవాణా, అసంఘటిత రంగ కార్మికులకు, వేధింపులకు గురవుతున్న బాలబాలికలకు న్యాయసహాయం, పేదరిక నిర్మూలన చర్యలు, గిరిజనుల హక్కులు, పరిరక్షణ, మత్తు పదార్థాల బారిన పడిన బాధితులకు న్యాయ సహాయం అందించడంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.

అట్టడుగువర్గాలకు న్యాయ సహాయం అందాలి: జస్టిస్ ఎన్వీ రమణ
 అట్టడుగువర్గాలకు ఇప్పటికీ న్యాయ సహాయం అందని పరిస్థితి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ (ఎన్వీ రమణ) అన్నారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతను ఆదుకునేందుకు న్యాయసేవా సాధికార సంస్థలు కృషి చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో ఇటీవల వారెంట్ రీకాల్ కోసం న్యాయవాదికి ఫీజు చెల్లించేందుకు డబ్బు లేక ఒక వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేసి, తానూ తనువు చాలించిన ఘటనను ప్రస్తావించారు. ప్రజలకు న్యాయ సహాయం అందుతున్న తీరుపై బెంగళూరుకు చెందిన దక్షా సంస్థ జరిపిన సర్వేలో అనేక చేదు నిజాలు వెల్లడయ్యాయని చెప్పారు. దాదాపు 31.3 శాతం మంది నిందితులకు న్యాయ సహాయం ఎలా పొందాలో కూడా తెలియదని... 40.2 శాతం మంది నిందితుల వార్షికాదాయం రూ.లక్షలోపు మాత్రమేనని పేర్కొన్నారు. అలాగే 90 శాతం మంది నిందితులు మొదటిసారి నేరాలకు పాల్పడినవారేనని తేలిందన్నారు. బాల నేరస్తులకు న్యాయ సహాయం అందడం లేదని, వారికి సత్వర న్యాయం అందించేందుకు ప్రయత్నించాలని సూచించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి కలిగిన వ్యక్తి అని, రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆయన తెలుగు భాషా ప్రేమికుడని, సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తున్నారని కొనియాడారు.

మధ్యవర్తిత్వంతో పరిష్కారం: జస్టిస్ బొసాలె
మధ్యవర్తిత్వం ద్వారా 26 శాతం కేసులను పరిష్కరించామని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె తెలిపారు. 10 నెలల కాలంలో 5,335 కేసులను మధ్యవర్తిత్వ కేంద్రాలకు సిఫార్సు చేస్తే అందులో 1,009 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. మధ్యవర్తులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించామని, 1,103 ప్యానల్ మధ్యవర్తులు, 296 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 13,715 లోక్‌అదాలత్‌లను నిర్వహించి 3.64 లక్షల కేసులను పరిష్కరించామని, బాధితులకు రూ.728 కోట్లు పరిహారంగా అందించామని వెల్లడించారు. 5 వేల అవగాహనా క్యాంపులు నిర్వహించి 4,340 మందికి ఉచిత న్యాయ సహాయం అందించామని తెలిపారు.

మరింతగా కృషి జరగాలి: సదానందగౌడ
లోక్ అదాలత్‌ల ద్వారా 5.5 లక్షల బ్యాంకింగ్ కేసులు పరిష్కారమయ్యాయని కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో జాతీయ న్యాయసేవా సాధికార సంస్థకు రూ.140 కోట్లు కేటాయించామని తెలిపారు. లోక్‌అదాలత్‌ల లక్ష్యాన్ని సాధించేందుకు మరింతగా కృషి జరగాలన్నారు. పూచీకత్తు సమర్పించలేక అనేక మంది విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గిపోతున్నారని.. జైళ్లలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లీనిక్స్ వారికి ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు.

అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి: సీఎం కేసీఆర్
ప్రత్యామ్నాయ విధానాల ద్వారా (ఏడీఆర్) వ్యక్తులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. పేద, అట్టడుగు వర్గాల ప్రజలకు అందరితో సమానంగా న్యాయం అందించాలని రాజ్యాంగం నిర్దేశించిందన్నారు. పేదరికం, వెనుకబాటుతనం కారణంగా ఎవరూ న్యాయ తిరస్కరణకు గురికాకూడదని పేర్కొన్నారు. ఖర్చు లేకుండా, సమయం వృథా కాకుండా లోక్‌అదాలత్‌లో న్యాయం పొందవచ్చన్నారు. పూర్వం గ్రామ పెద్దలు వివాదాలను పరిష్కరించిన తరహాలోనే నిరుపేదలకు న్యాయం అందించే లక్ష్యంతో లోక్‌అదాలత్‌లు పనిచేస్తున్నాయని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రమేశ్‌రంగనాథన్, ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, బిహార్ మాజీ సీజే జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, నల్సా సభ్య కార్యదర్శి అలోక్ అగర్వాల్‌తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల న్యాయసేవా సాధికార సంస్థల సభ్య కార్యదర్శులు పాల్గొన్నారు.
 

న్యాయసేవా సంస్థ వెబ్‌సైట్ ఆవిష్కరణ
తెలంగాణ న్యాయసేవా సాధికార సంస్థ వెబ్‌సైట్‌ను, అంధులకు ఉపయుక్తంగా ఉండేలా వికలాంగుల హక్కులపై బ్రెయిలీ లిపి (తెలుగు)లో రూపొందించిన 13 చట్టాలను సదస్సు సందర్భంగా ఆవిష్కరించారు. న్యాయసేవా సాధికార సంస్థ యాప్‌ను సదానందగౌడ ఆవిష్కరించారు. ప్రత్యామ్నాయ విధానంగా ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం కోసం రూపొందించిన హ్యాండ్‌బుక్.. ఏపీ, తెలంగాణలో న్యాయసేవా సాధికార సంస్థలు సాధించిన విజయాలపై రూపొందించిన పుస్తకాలను జస్టిస్ దవే ఆవిష్కరించారు. సింగరేణి స్వాధీనం చేసుకున్న భూమికి సంబంధించి రూ.74 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందించారు. యాసిడ్‌దాడిలో గాయపడిన వ్యక్తికి రూ.3 లక్షల పరిహారాన్ని జస్టిస్ రమణ అందించారు.

మరిన్ని వార్తలు