విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టు
సాక్షి,న్యూఢిల్లీ: విద్యుత్ ఉద్యోగుల విభజనను ఎందుకింత జటిలం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, డిస్కమ్ల ఉద్యోగుల విభజనపై దాఖలైన పిటిషన్ను జస్టిస్ అభయ్ మనోహర్సాప్రే, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ధర్మాసనం బుధవారం విచారించింది. ఏపీకి వెళ్తామని ఆప్షన్ ఇచ్చిన 600 మంది ఉద్యోగులను తీసుకునేందుకు ఏపీ ముందుకు రావటం లేదని తెలంగాణ ఉద్యోగుల తరఫు న్యాయవాదులు కొలిన్ గోన్సాల్వే, మహావీర్సింగ్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
‘తెలంగాణ రిలీవ్ చేసిన ఉద్యోగులను హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి తీసుకున్నా వారికి వేతనాలు మాత్రమే చెల్లిస్తూ విధులు అప్పగించడం లేదని, వారిని కూడా రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణించాలని ఏపీ ఉద్యోగుల తరఫున వికాస్ సింగ్, రవిశంకర్ కోర్టుకు నివేదించారు. వాదనల అనంతరం ‘ఇదీ కేవలం ఉద్యోగుల విభజన. ఎందుకింత జటిలం చేశారు..’అని సుప్రీం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను కోర్టు వచ్చేనెల 18కి వాయిదా వేసింది.