వైవీ స్ఫూర్తితో రైతుల పక్షాన పోరాడాలి: సురవరం 

17 Feb, 2020 03:07 IST|Sakshi
రాష్ట్ర రైతు సంఘం వైవీ కృష్ణారావు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సురవరం. చిత్రంలో చాడ

కాచిగూడ : రైతులు పండించిన పంటకు  మెరుగైన ధరకోసం, వారి రక్షణ కోసం రైతు సంఘం పోరాడాలని సీపీఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. రైతు సంఘాల ఐక్యకార్యచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు పోవడం అభినందనీయమ న్నారు. ఆదివారం హిమాయత్‌నగర్‌ అమృత ఎస్టేట్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర రైతు సంఘం వై.వి.కృష్ణారావు కార్యాలయాన్ని సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మఖ్దూంభవన్‌లో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సంఘం సీనియర్‌ నేత వై.వి.కృష్ణారావు తన జీవితాంతం కనీస ధరల కోసం పోరాడారని, కేద్రం ఏర్పాటు చేసిన కనీస ధరల కమిషన్‌కు ఆయనే చైర్మన్‌ అయ్యారని గుర్తుచేశారు. ఇప్పటికీ వామపక్షాలకు చెందిన రైతు సంఘాలే వారికోసం పనిచేస్తున్నాయన్నారు.

ప్రొఫెసర్‌ వకుళాభరణం రామకృష్ణ మాట్లాడుతూ మంచి కమ్యూనిస్టుగా ఉండడం అరుదనీ, ఇలాంటి వారిలో వై.వి.ఒకరని, ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఉండటం ఆ పార్టీకే గొప్పతనం అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వై.వి.కృష్ణారావు వ్యవసాయంపైనే కాకుండా దేశ ఆర్థిక విధానాలపైనా ఎన్నో పుస్తకాలు రాశారన్నారు.  

మరిన్ని వార్తలు