‘పాలమూరు’ పనుల పరిశీలన

17 Mar, 2018 02:58 IST|Sakshi

ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల సందర్శన

సాక్షి, నాగర్‌ కర్నూల్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శరవేగంగా సాగుతున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల, ఇతర ప్రాజెక్టులను ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి పలువురు మీడియా ప్రతినిధులతో శుక్రవారం ఉదయం 11 గంటలకు నాగర్‌ కర్నూల్‌కు చేరుకున్న అల్లం నారాయణకు మంత్రి జూపల్లి కృష్ణారావు స్వాగతం పలికారు.

అనంతరం ఆయన కొల్లాపూర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న ఎల్లూరు రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. 0 పాయింట్‌ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నమూనాను అల్లం నారాయణకు ఇంజనీర్లు వివరించారు. అనంతరం ఆయన గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌తోపాటు భగీరథ పనులను, కోతి గుండు వద్ద శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ పంపుహౌజ్, నార్లాపూర్‌ జలాశయం పనులు, ఏదుల జలాశయం పనులను మీడియా ప్రతినిధులతో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రాజెక్టు సీఈవో లింగరాజు మాట్లాడుతూ ఆసియాలోనే పాలమూరు రికార్డు సృష్టించనుందని, 41 అధునాతన పంపులతో దీన్ని చేపట్టామన్నారు. జూపల్లి ఈ ప్రాజెక్టు టన్నెల్‌ పనులను దగ్గరుండి అల్లం నారాయణకు చూపిం చారు. 3 కిలోమీటర్ల మేర టన్నెల్‌లో ప్రయాణించి సొరంగం నిర్మాణం, ప్రాజెక్టు ప్రగతిపై అల్లం బృందం వారితో ముచ్చటించింది.  

మరిన్ని వార్తలు