ఆస్ట్రేలియాలో సూర్యాపేట జిల్లావాసి మృతి

26 Dec, 2017 02:24 IST|Sakshi

నాలుగేళ్లుగా హైదరాబాద్‌ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం

ఆరు నెలల క్రితమే ఆస్ట్రేలియాకు..

మిర్యాలగూడ అర్బన్‌: ఆస్ట్రేలియాలో సోమవారం సూర్యాపేట జిల్లావాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నాలుగేళ్లుగా హైదరాబాద్‌ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసి.. ఆరునెలల క్రితమే ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఇంతలోనే మృత్యువాతకు గురికావడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజవారిగూడానికి చెందిన కోన వెంకట్‌రెడ్డి, సరోజనమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కోన ఆదినారాయణరెడ్డి(36). హైదరాబాద్‌ ఇన్ఫోసిస్‌ కంపెనీ తరఫున ఆరు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉద్యోగానికి వెళ్లాడు.

అప్పటి నుంచి అతడి భార్య శిరీష నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆమె పిన్ని వద్ద ఉంటుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆదినారాయణరెడ్డి తన భార్య శిరీషకు ఫోన్‌ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఫోన్‌ చేసి ఒంట్లో నలతగా ఉందని చెప్పినట్లు అతని భార్య శిరీష తెలిపింది. అనంతరం రెండు గంటల తర్వాత ఫోన్‌ చేసినా ఎంతకూ తీయకపోడంతో అక్కడ తెలిసిన వ్యక్తికి విషయం తెలిపారు. దీంతో అతను ఆదినారాయణరెడ్డి ఉంటున్న గదికి వెళ్లి చూడగా బెడ్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపాడు. 

మరిన్ని వార్తలు