ఖానాపూర్‌లో వీడని ఉత్కంఠ... 

14 Nov, 2018 16:30 IST|Sakshi

సాక్షి ,ఆదిలాబాద్‌:మూడు జిల్లాలలో విస్తరించి ఉన్న గిరిజన నియోజకవర్గం ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. ఇక్కడి నుంచి ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ, గతంలో పోటీ చేసిన హరినాయక్‌ సైతం బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గాంధీభవన్‌ వద్ద హరినాయక్‌కు టికెట్‌ ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు నిరాహార దీక్షలు సైతం చేపట్టారు. వీరిద్దరితో పాటు పార్టీ నాయకులు భరత్‌ చౌహన్, చారులత రాథోడ్, కోట్నాక రమేష్, లీనారావు, జానుబాయి, రాంకిషన్‌నాయక్, గంగాధర్‌నాయక్, భూక్యా గోవింద్‌ తదితరులు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇందులో సగం మంది రాథోడ్‌ రమేశ్‌కు కాకుండా తమలో మరెవరికి టికెట్‌ ఇచ్చినా సహకరిస్తామని చెబుతున్నట్లు సమాచారం. రాథోడ్‌ రమేశ్‌ టీడీపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి టికెట్‌ కోసమే ఇటీవల పార్టీలో చేరాడని, ఆయనకు టికెట్‌ ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.   

>
మరిన్ని వార్తలు