వచ్చే ఏడాదికల్లా స్వచ్ఛ తెలంగాణ

7 Oct, 2017 03:17 IST|Sakshi

బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా రూపుదిద్దుదాం: ఎస్పీ సింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేఏడాది అక్టోబర్‌ 2 నాటికి తెలంగాణను బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా రూపుదిద్దాలన్న ఆశయంతో గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు స్వచ్చందంగా భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌ కోరారు. ‘స్వచ్ఛ సంకల్ప్‌ సే స్వచ్ఛసిద్ధి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం స్వచ్ఛభారత్‌పై నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, షార్ట్‌ఫిలింలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన 19 మందికి సర్టిఫికెట్లను శుక్రవారం సచివాలయంలో ప్రదానం చేశారు. వ్యాసరచన పోటీల్లో ఓపెన్‌ కేటగిరి విభాగంలో వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన బి.ప్రియాంక, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కె.రమేశ్, ఖమ్మం జిల్లాకు చెందిన గురుస్వామి, నిజామాబాద్‌కు చెందిన నిషాంత్‌లు బహుమతులు గెలుపొందారు.

సర్పంచ్‌ల విభాగంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రామ్‌సాగర్‌ గ్రామ పంచాయతీకి చెందిన పి.గంగాధర్, మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం షెట్టిపల్లి కలాన్‌ గ్రామ పంచాయతీకి చెందిన మల్లేశం, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామపంచాయతీకి చెందిన జిన్న గంగాధర్‌లు బహుమతులు గెలుపొందారు. పెయింటింగ్‌ విభాగంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన సాహస, జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన వీరేశ్, ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్‌.సుష్మలు బహుమ తులు గెలుపొందారు. షార్ట్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ విభాగంలో జగిత్యాల జిల్లాకు చెందిన అశోక్‌ భోగే, భద్రాద్రి జిల్లాకు చెందిన జగత్‌కుమార్‌రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డి.ప్రకాశ్, ఖమ్మం జిల్లాకు చెందిన మొగలి వెంకటేశ్వర్లు బహుమతులు గెలుపొందారు. ఈ పోటీలు ఆగస్టు్ట 16 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు నిర్వహించారు.

మరిన్ని వార్తలు