స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముందడుగు..

14 Feb, 2018 14:41 IST|Sakshi

ఫీడ్‌బ్యాక్‌లో దేశంలో 44, రాష్ట్రంలో 2 స్థానం

2500 మంది కోరుట్ల బడ్డీ యాప్‌ డౌన్‌లోడ్‌

600 సమస్యల ఫిర్యాదులు పరిష్కారం

రహదారులు పరిశుభ్రం

కోరుట్ల టౌన్‌ : స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపాల్టీ ప్రగతి పథంలో దూసుకుపోతుంది. దేశంలో 40 41 నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పోటీపడుతూ పరిసరాల పరిశుభ్రత, 100 శాతం సానిటేషన్, పారిశుధ్యం పనులు, తడి, పొడి చెత్త సేకరణ, ఉదయం, రాత్రి వేళల్లో జాతీయ రహదారితోపాటు, ప్రధాన రహదారులు పరిశుభ్రం చే స్తూ, చెత్త రహిత మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతున్న క్రమంలో మందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఫీడ్‌బ్యాక్‌లో దేశ ంలో 44వ స్థానం, రాష్ట్రంలో 2వ స్థానంలో కొనసాగుతుంది.

కోరుట్ల బడ్డీ యాప్‌కు స్పందన..
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కోరుట్ల పట్టణంలోని ప్రజలకు తమ సమస్యలు పరిష్కారానికి, పన్నులు ఆన్‌లైన్‌లో చెల్లించడానికి కోరుట్ల బడ్డీ యాప్‌ రూపొందించి, ప్రచారం చేశారు. ప్రధాన చౌరస్తాల్లో ప్రచారబోర్డులపై అవగాహన కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రజలను భాగస్వాములు చేసేందుకు 31వార్డుల్లో విస్తృత ప్రచారం చేస్తూ, ప్రధాన కూడళ్ళు, కళాశాలల్లో, దుకాణా ల వద్ద బడ్డీ యాప్‌ ప్రచారం చేశారు. వాల్‌ పోస్టర్, గోడ రాతలతో బొమ్మలు వేయించారు. కోరుట్ల బడ్డీ యాప్‌కు స్పందన లభించింది. జనవరి 8, 9 రెండు రోజులు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పనితీరుపై పర్యవేక్షకులు కోరుట్లకు చేరుకుని వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. 2 నెలల్లో 2500 మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 700 మంది తమ సమస్యల పరిష్కారానికి బడ్డీ యాప్‌ను వినియోగించుకోగా 654 సమస్యలు వెంటనే పరిష్కరమయ్యాయి. 46 సమస్యలు ఆర్థిక వనరులతో చేపట్టాల్సిన అవసరం ఉండడంతో నిధులు రాగానే పనులు పూర్తి చేయనున్నట్లు పర్యవేక్షిస్తున్న ఇంజినీర్‌ ఎ.మహిపాల్‌ పేర్కొన్నారు.

షీ టాయిలెట్స్‌ నిర్మాణం
మున్సిపల్‌ నిధులతో రూ. 2లక్షలు వెచ్చించి, గురుజు మార్కెట్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా షీ టాయిలెట్స్‌ నిర్మాణం చేశారు. మహిళలకు టాయిలెట్స్‌ ఇబ్బందులు తీర్చారు. ప్రత్యేకంగా మహిళ సిబ్బందిని ఏర్పాటు చేసి, టాయిలెట్స్‌ నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.

రహదారులు పరిశుభ్రం
పట్టణంలోని జాతీయ రహదారి, ప్రధాన రహదారులు, బిజినెస్‌ కూడళ్ళ దారులు టీచర్స్‌క్లబ్‌ రోడ్, ఇందిరారోడ్, ఐబీరోడ్‌లను రాత్రివేళల్లో ఊడ్చివేయిస్తున్నారు. మిగతా రహాదారులు ఉదయం వేళ పరిశుభ్రం చేయిస్తూ, చెత్త రహిత రహదారులుగా పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. సానిటేషన్‌పై ప్రత్యేకశ్రద్ధ పెట్టి, అవసరమైన చోట మురికి కాలువలు నిర్మాణం చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల భాగస్వామ్యంతో..
స్వచ్ఛ సర్వేక్షణ్‌కు ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రథమస్థానం దేశంలో మంచి స్థానం పదిలం చేసేం దుకు ప్రతీ రోజు పనులతీరును పర్యవేక్షిస్తున్నాం. రహదారులు పరిశుభ్రంగా ఉండేందుకు ఉదయం, రాత్రి వేళల్లో క్లీన్‌ చేయిస్తున్నాం. రోడ్లపై చెత్త వేయకుండా అన్ని చర్యలు తీసుకొని, అందంగా ఉంచుతున్నాం.   
  – అల్లూరి వాణిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు