స్వాతికి జామీను ఉపసంహరణ

4 Aug, 2018 01:26 IST|Sakshi

కోర్టుకు వెల్లడించిన ఇద్దరు వ్యక్తులు

సాక్షి, నాగర్‌ కర్నూల్‌: ప్రియుడితో కలసి భర్తను హత్య చే సిన స్వాతి ఉదంతం మరో మలుపు తిరిగింది. స్వాతికి జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు దానిని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. గతేడాది నవంబర్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చెందిన సుధాకర్‌రెడ్డిని ఆయన భార్య స్వాతి, తన ప్రియుడు రాజేశ్‌తో కలసి హత్య చేయగా డిసెంబర్‌లో ఈ విషయం బయటపడింది.

అప్పటి నుంచి స్వాతి మహబూబ్‌నగర్, రాజేశ్‌ నాగర్‌కర్నూల్‌ జైల్లో ఉంటున్నారు. గత నెల 16న స్వాతికి మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టులో బెయిల్‌ లభించగా పూచీకత్తు ఇచ్చే వారెవరూ లేకపోవడంతో ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది. నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీలో పనిచేసే ఓ వ్యక్తితోపాటు మరొకరు ఆమెకు జామీను ఇవ్వగా గత నెల 27న జైలు నుంచి విడుదలైంది.

స్వాతిని తీసుకువెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో అధికారులు మహబూబ్‌నగర్‌లోని రాష్ట్ర సదనానికి తరలించారు. పోలీసులు శుక్రవారం ఆమెను నాగర్‌కర్నూల్‌ కోర్టులో హాజరుపర్చారు. స్వాతికి జామీను ఇచ్చిన ఇద్ద రు  న్యాయస్థానం ముందుకు వచ్చి తమ పూచీకత్తును ఉపసంహరించుకుంటున్నామని న్యాయమూర్తికి విన్నవించారు. ఈ అంశంపై కోర్టు 7వ తేదీ వరకు గడువు పెట్టింది.

మరిన్ని వార్తలు