హత్య చేసి.. ఆపై కాల్చేసి..

28 May, 2017 01:43 IST|Sakshi
హత్య చేసి.. ఆపై కాల్చేసి..

► వీడిన నరేశ్‌ మిస్సింగ్‌ మిస్టరీ
► దారుణంగా హతమార్చిన స్వాతి తండ్రి


సాక్షి, హైదరాబాద్‌/యాదాద్రి: ‘మిస్సింగ్‌’మిస్టరీ వీడింది.. ప్రేమ పెళ్లి విషాదాంతమైంది.. యాదాద్రి జిల్లా భువనగిరిలో అదృశ్యమైన అంబోజు నరేశ్‌ దారుణ హత్యకు గురైనట్లు తేలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి తండ్రే ఆయన్ను అత్యంత దారు ణంగా హతమార్చాడు. సమీప బంధువుతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు రాచకొండ పోలీసులు నిర్ధారించారు.

ఈ కేసుకు సంబంధించి స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి, అతడి భార్య సోదరి కొడుకు నల్ల సత్తిరెడ్డిలను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్‌ మహేష్‌ ఎం.భగవత్‌ శనివారం వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఎల్బీనగర్‌ డీసీపీ ఎంవీ రావు నేతృత్వంలో దర్యాప్తు చేశామని, తన 21 ఏళ్ల సర్వీసులో ఇంతటి క్లిష్టమైన కేసును చూడలేదని మహేశ్‌ భగవత్‌ వ్యాఖ్యానించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం...  

ఫేస్‌బుక్‌.. ప్రేమ.. పెళ్లి..  
యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం లింగ రాజుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ మండల నాయకుడు తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి కూతురు స్వాతితో ఇదే మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేశ్‌కు రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. నరేశ్‌ తల్లిదం డ్రులు ముంబైలో ఉంటున్నారు. పల్లెర్లలో తాత వద్ద ఉంటూ నరేశ్‌ భువనగిరిలో డిగ్రీ చదివాడు. స్వాతి వలిగొండలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ చదివింది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

మార్చి 24న ముంబై వెళ్లిన వీరు మరుసటి రోజు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. దీంతో తన కూతురు అదృశ్యమైందంటూ నరేశ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకూరు (ఎం) పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. రామన్నపేట ఇన్‌స్పెక్టర్‌ కోరడంతో ముంబై నుంచి నరేశ్, స్వాతి మార్చి 27న రామన్నపేట వచ్చారు. అదే రోజు స్వాతి తన తండ్రితో వెళ్లిపోగా.. నరేశ్‌ ముంబై వెళ్లాడు. స్వాతిని కుటుంబీకులు ఉప్పల్‌లో ఉన్న ఆమె సోదరి వద్ద ఉంచారు. ఇదిలా ఉండగా.. మార్చి 31న స్వాతి మళ్లీ ముంబైలో ఉన్న భర్త నరేశ్‌ వద్దకు వెళ్లింది.

మే 2న తిరిగి వచ్చిన దంపతులు..
స్వాతి అత్తారింటికి వెళ్లిన తర్వాత పలుమార్లు తన తండ్రితో మాట్లాడింది. అక్కడ తన పరిస్థితులు బాగోలేదంటూ పలుమార్లు చెప్పుకుంది. ఈ పరిణా మాల నేపథ్యంలో ఈ నెల 2న నరేశ్, స్వాతి ముంబై నుంచి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం స్వాతి తన తండ్రికి చెప్పింది. దీంతో ఆ రోజు రాత్రి సత్తిరెడ్డితో కలసి అతడి కారులోనే శ్రీని వాస్‌రెడ్డి భువనగిరి వెళ్లాడు. తర్వాత స్వాతిని తీసు కొని శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డి లింగరాజుపల్లికి వచ్చారు.

బైక్‌ను వెంబడించగా...
ఈ నెల 2న రాత్రి 10 గంటల సమయంలో సిగరెట్‌ కాల్చుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటి ముందు తెల్లరంగు చొక్కా ధరించిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై సంచరిస్తు న్నట్లు గమనించాడు. మరో గంట తర్వాత కూడా అలాగే జరగడంతో అతడెవరో చూద్దామన్న ఉద్దేశంతో ఇంట్లో ఉన్న సత్తిరెడ్డితో కలసి శ్రీనివాస్‌రెడ్డి మరో బైక్‌పై వెంబడించారు.

శ్రీనివాస్‌రెడ్డి వెళ్తూ తన వెంట ట్రాక్టర్‌ రాడ్‌ కూడా తీసుకువెళ్లాడు. దాదాపు 1.5 కి.మీ. వెంటపడినా ద్విచక్ర వాహనదారుడిని అందుకోలేకపోయారు. అయితే శ్రీనివాస్‌రెడ్డి పొలా నికి సమీపంలో మరో వ్యక్తి.. తమ ముందు వెళ్తున్న బైక్‌ను ఆపడానికి యత్నించాడు. కానీ బైక్‌ ఆగకుండా వెళ్లిపోయింది. ఆ బైక్‌ను అపేందుకు యత్నించిన వ్యక్తి ఎవరా అని దగ్గరకు వెళ్లి చూడగా అతడిని నరేశ్‌గా గుర్తించారు.

పొలంలోనే చంపి కాల్చేశారు...
తమ కంటపడ్డ నరేశ్‌ను.. ఇక్కడకు ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? అంటూ శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డి ప్రశ్నించారు. అనంతరం బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకొని సమీపంలో ఉన్న తమ కంది చేను వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ నరేశ్, సత్తిరెడ్డి కూర్చు ని మాట్లాడుకుంటుండగా.. వెనుక నుంచి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి ట్రాక్టర్‌ రాడ్‌తో మెడ భాగంలో బలంగా కొట్టాడు. దీంతో నరేశ్‌ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత సమీపంలో ఉన్న కందికట్టలో మృతదేహాన్ని పడేసి నిప్పుపెట్టారు. శవం సగమే కాలడంతో ఆత్మ కూరు(ఎం)లోని పెట్రోల్‌బంక్‌కు వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డి ఐదు లీటర్ల పెట్రోల్‌ తెచ్చారు.

తమ పొలంలో ఉన్న టైర్ల మధ్యలో మృతదేహాన్ని ఉంచి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తర్వాత శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటికి, నరేశ్‌ సెల్‌ఫోన్‌ తీసుకున్న సత్తిరెడ్డి బోడుప్పల్‌లోని తన ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు(మే3) సాయంత్రం మౌలాలీ రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లిన సత్తిరెడ్డి నరేశ్‌ సెల్‌ఫోన్‌ ధ్వంసం చేశాడు. పొలం వద్దకు వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి గన్నీ బ్యాగ్‌లో నరేశ్‌ అస్థికలను తీసుకెళ్లి వేములకొండ– లక్ష్మాపూర్‌ మధ్యలో మూసీలో కలిపేశాడు. గన్నీబ్యా గ్‌ను సమీపంలో పొదల్లోకి విసిరేసి ఇంటికి వెళ్లిపో యాడు. కాగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

బాత్‌రూంలో ఉరేసుకున్న స్వాతి..
నరేశ్‌ మిస్సింగ్‌పై అతడి తల్లిదండ్రులు మే 6న భువనగిరి ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరుసటి రోజు విచారణ కోసం శ్రీనివాస్‌రెడ్డిని పోలీసుస్టేషన్‌కు పిలిచారు. దీంతో పోలీసులు తనను, తన తండ్రిని వేధిస్తున్నా రంటూ స్వాతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత 12న మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిన స్వాతి.. 16న బాత్‌రూమ్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఆ సమయంలో తన తండ్రి సెల్‌ఫోన్‌లో అత్తారింటి వేధింపులు అంటూ ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఈ నెల 18న నరేశ్‌ తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ ఫైల్‌ చేయడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు 22న ఎల్బీనగర్‌ డీసీపీ నేతృత్వంలో దర్యాప్తు మొదలైంది. అనుమా నంతో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిం చగా.. నరేశ్‌ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తదుపరి దర్యాప్తు, ఆధారాల సేకరణ కోసం శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డిని న్యాయస్థానం అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

చిక్కుముడులు ఇంకా ఉన్నాయి
ఈ కేసులో ఇంకా కొన్ని చిక్కుముడులున్నాయి. ఆత్మహత్య చేసుకునేప్పటికి స్వాతి నెల రోజుల గర్భిణి. పోస్టుమార్టంలో ఇది ఆత్మహత్యగా తేలినా... వైరల్‌ అయిన ఆమె 3 సెల్ఫీ వీడియో లు స్వాధీనం చేసుకున్నాం. ఇది సెల్ఫీయా? కాదా.. అనేది నిర్ధారించడానికి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపుతున్నాం.

శ్రీనివాస్‌రెడ్డికి గతంలోనూ నేరచరిత్ర ఉందని తెలుస్తోంది. 25 ఏళ్ల కిందట వారింట్లో కొందరు చనిపోగా.. అతడి అనుచరుడిపై కేసు నమోదైంది. నరేశ్‌ హత్య జరిగిన రోజు అతడితో వచ్చిన తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి ఎవరో గుర్తించాల్సి ఉంది. నరేశ్‌తో వెళ్లిన తర్వాత ముంబైలో తన కుమార్తె గురైన ఆవేదనకు ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్లు శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్నాడు. ఇందులో నిజానిజాలు నిర్ధారించాల్సి ఉంది.            
                           
– మహేశ్‌ భగవత్, రాచకొండ సీపీ

మరిన్ని వార్తలు