జగిత్యాల జీవన జ్యోతి

30 Nov, 2018 16:09 IST|Sakshi

భుజంపైన ఎప్పుడూ కండువా లేదా ఒక పంచె, తెల్లటి చొక్కా, పాంటుతో సాదాసీదాగా కనిపించే పౌరుడు. వృత్తి రీత్యా న్యాయవాది. రైతుబిడ్డ. కరీంనగర్ జిల్లాలోనే కాదు... రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి. వివాదరహితుడు. మృధుస్వభావి. జీవనన్నగా అందరికీ సుపరిచితుడు. అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా... " ఏదైతే ఉందో..."  ఊతపదంతో చెప్పే విషయంలో వాడివేడిగా  చెబుతున్న విషయంలో పస ఉంటుంది. రాజకీయాల్లో నిబద్దత కలిగిన నేత. ఎన్టీఆర్‌, నాదెండ్ల భాస్కర రావు, వైఎస్‌ఆర్‌ లాంటి ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసినా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిత్వం ఆయనది. కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంట ఉండి మరీ కార్యాలయాలకు వెళ్లి పనులు చక్కబెట్టే మంచితనం ఆయన సొంతం. పార్టీ సమావేశాల కన్నా స్థానిక ప్రజల కార్యక్రమాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అసెంబ్లీ లోపల బయట ఎలాంటి వివాదాలు దరిచేరనివ్వని ఆయన.. ఆగస్టు సంక్షోభంలో నాదెండ్లవైపు నిలబడటం ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక బ్రేక్ లా నిలిచిపోయింది. ఆ పరిణామం అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. వైఎస్ కేబినేట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నుంచి ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఏడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు.

కుటుంబ నేపథ్యం :

పేరు : తాటిపర్తి జీవన్ రెడ్డి 
పుట్టిన తేది : 5 జనవరి, 1952
ఊరు : బతికపల్లి, పెగడపల్లి మండలం, జగిత్యాల జిల్లా 
తల్లి దండ్రులు : లింగమ్మా, రామచంద్రారెడ్డి 
భార్య : అహల్యాదేవి (ముగ్గురు కుమారులు)
చదువు : నిజాం కాలేజీ నుంచి బీఏ, ఉస్మానియా నుంచి ఎల్‌ ఎల్ బీ (జగిత్యాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు)

రాజకీయ ప్రస్థానం :

- 1989 లో మొదటిసారిగా మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షునిగా ఎన్నిక
- 1983 లో టీడీపీలో చేరిక, జగిత్యాల నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగు, (ఎన్టీఆర్ కేబినేట్ లో ఎక్సైజ్ మంత్రిగా)
- 1985 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి రాజేశంగౌడ్‌ చేతిలో ఓటమి
- 1989 లో కాంగ్రెస్ నుంచి పోటీ గెలుపొంది రెండోసారి అసెంబ్లీకి
- 1994 లో అన్యూహ్యంగా తెరపైకి వచ్చిన ఎల్‌.రమణ టీడీపీ నుంచి బరిలో దిగగా జీవన్‌రెడ్డి ఓటమి
- 1996 లో రమణ ఎంపీకి వెళ్లడంతో అదే ఏడాది జగిత్యాల స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా టీడీపీపై జీవన్‌ భారీ మెజార్టీతో గెలుపు
- 1999, 2004 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి వరుస విజయాలు
- 2006, 2008 లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ ఓటమి
- 2009 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి
- 2014 లో టీఆర్‌ఎస్‌ గాలిని ఎదుర్కొని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు 
- 2014 నుంచి శాసనసభ కాంగ్రెస్‌ పక్ష ఉపనేతగా కొనసాగారు

- వి. కుమారస్వామి (సాక్షి జర్నలిజం స్కూల్‌)

మరిన్ని వార్తలు