అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి: రకుల్‌

14 Nov, 2017 11:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. నేడు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌ నుంచి రవీంద్రభారతి వరకు నిర్వహించిన సైకిల్‌ ర్యాలీని నటి రకుల్‌తో పాటు ఆ శాఖ డైరెక్టర్‌ విజయోద్రీ మంగళవారం ఉదయం ప్రారంభించారు. సైకిల్ ర్యాలీ ముగిసిన తర్వాత రకుల్‌ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ ద్వారా బ్రూణ హత్యలు చేయడం చట్టరీత్యా నేరమని, లింగ నిర్ధారణకు సహకరించే వారినీ కఠినంగా శిక్షించాలని కోరారు.

అమ్మాయి, అబ్బాయిల మధ్య వ్యత్యాసాలు చూపించవద్దన్నారు. అందరూ సమానమేనని, ఇద్దరికీ సమాన స్వేచ్ఛ ఇవ్వాలని ఆమె చెప్పారు. మహిళల అక్రమ రవాణా నివారించడంతో పాటు బాల్య వివాహాలను నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా రకుల్ పిలుపునిచ్చారు. పెళ్లి చేసుకోవడానికి వరకట్నం తీసుకునే వారిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు రకుల్‌ విజ్ఞప్తిచేశారు.
 

మరిన్ని వార్తలు