పులి సంరక్షణకు చర్యలు ముమ్మరం

15 Jun, 2018 14:01 IST|Sakshi
గాయం తగ్గిందని విడుదల చేసిన పులి ఫొటో 

ఢిల్లీ నుంచి  ప్రత్యేక నిపుణుడు రాక

డివిజన్‌లో మూడు రోజులపాటు పర్యటన

గాయం తగ్గిందా.. ఉచ్చు ఊడిందా అనే విషయాలపై పరిశీలన

జిల్లా అటవీ శాఖ అధికారి రామలింగం

చెన్నూర్‌ ఆదిలాబాద్‌ : జాతీయ జంతువు పులి సంరక్షణకు చర్యలు ముమ్మరం చేశామని, పులి ఆరోగ్య పరిస్థితిని గమనించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణులు వచ్చినట్లు మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అ ధికారి రామలింగం తెలిపారు.

స్థానిక ఫారెస్ట్‌ కా ర్యాలయంలో గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన టైగ ర్‌ ట్రాకర్‌ నిపుణులు వాషీక్‌ జంషాద్‌తో కలసి వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. చెన్నూర్‌ ప్రాంతంలోని పులి ఆరోగ్య పరిస్థితిపై ‘సాక్షి’లో వ చ్చిన కరుస కథనాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వె ళ్లాయని, కేంద్రమంత్రి మేనకాగాంధీ ఢిల్లీ నుంచి టైగర్‌ ట్రాకర్‌ను చెన్నూర్‌ డివిజన్‌కు   పంపించా రని చెప్పారు.

టైగర్‌ ట్రాకర్‌తో కలిసి చెన్నూర్‌ మండలంలోని బుద్దారం అటవీ ప్రాంతంలో పర్యటించినట్లు తెలిపారు. 2016 జనవరిలో కాగజ్‌నగ ర్‌ ప్రాంతంలో ఫాల్గుణ ఆడపులికి నాలుగు పిల్లలు జన్మించాయని, నవంబర్‌లో అక్కడి నుంచి కే–4 అనే ఆడపులి చెన్నూర్‌ డివిజన్‌ ప్రాంతానికి వచ్చిందని అన్నారు.

ఆ సమయంలో నడుము ప్రాంతంలో ఇనుప ఉచ్చు బిగిసి ఉన్నట్లు సీసీ కెమెరాలో కనిపించిందని తెలిపారు. పులి సంరక్షణ కోసం బేస్‌క్యాంప్, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పులికి గాయం తగ్గుముఖం పట్టినట్లు సీసీ కెమెరాలో కనిపించిందని, ఫిబ్రవరి నుంచి నేటి వరకు ఎక్కడా సీసీ కెమెరాకు చిక్కలేదని వివరించారు. 

పులి ఆరోగ్య కోసం ప్రత్యే కమిటీ.. 

పులి ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లాలో కమిటీ ఏ ర్పాటు చేశామని, ఈ కమిటీ ప్రతి నెల పర్యవేక్షణ నిర్వహిస్తుందని రామలింగం తెలిపారు. పులి అ నారోగ్యంగా ఉంటే ఆహారం తీసుకోదని పశువైద్యులు చెబుతున్నారని, గత నాలుగు నెలల నుం చి సుమారు 27కు పైగా పశువులను హతమార్చిం దని అన్నారు. పులి గాయాన్ని పరిశీలించేందుకు ప్రయత్నం చేస్తే పులి ప్రవర్తనలో మార్పులు వస్తాయని వైద్యులు సూచనల మేరకు పులిని ట్రాప్‌ చేసేందుకు ప్రయత్నించలేదని పేర్కొన్నారు. 

ఉచ్చు ఉందా అనే విషయంపై...

ఢిల్లీ నుంచి వచ్చిన టైగర్‌ ట్రాకర్‌ వాషీక్‌ జంషాద్‌ మూడు రోజులపాటు చెన్నూర్‌ డివిజన్‌లోని అటవీ ప్రాంతంలో పర్యటిస్తారని రామలింగం తెలిపారు. ముఖ్యంగా పులికి గాయం తగ్గిందా, ఉచ్చు ఉందా అనే విషయాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.

పులికి బిగుసుకున్న ఉచ్చు ఉండిపోయి, గాయం తగ్గినట్లయితే పులిని ట్రాప్‌ చేయాల్సిన పని లేదన్నారు. గాయం తగ్గిన పులికి ఉచ్చు ఉంటే టైగర్‌ మానిటరింగ్‌ కమిటీ ప్రత్యేక నిపుణుల సలహాలతో పులిని పట్టుకొని వైద్యసేవలు అందిస్తామని అన్నారు. 

వేటగాళ్లపై ఉక్కుపాదం...

రెండేళ్ల క్రితం నెస్ట్‌ అనే పులి వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ వైర్లు తగిలి మృతిచెందిందని రామలింగం తెలిపారు. వన్యప్రాణుల వేటగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని, ఇప్పటికే వేటగాళ్లను గుర్తించి హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు.

చెన్నూర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్‌ల పరిధిలోని వన్యప్రాణుల వేటగాళ్లపై ప్రతేక నిఘా ఏర్పాటు చేశామని, పిచ్చుకను చంపినా అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎఫ్‌డీవో రాజారావు, చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్‌ అధికారులు అనిత, రవి, అరవింద్, ఫారెస్ట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు