‘కువైట్‌’పై జోక్యం చేసుకోండి

20 Feb, 2018 03:05 IST|Sakshi
కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నేతలు

     ప్రధాని, విదేశాంగ మంత్రికి కుంతియా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల వినతి

     ఆమ్నెస్టీ గడువు పొడగించేలా చొరవ చూపాలి

మోర్తాడ్‌ (బాల్కొండ): కువైట్‌ పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకొనిభారత కార్మికులకు ఊరట కల్పించాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లేఖలు రాశారు. కువైట్‌ లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులు తమ సొం  దేశాలకు వెళ్లిపోవడానికి అమలు చేసిన క్షమాభిక్ష ఆమ్నెస్టీకి ఈ నెల 22తో గడువు ముగిసిపోనుంది. సమయం తక్కువగా ఉండటంతో మన దేశ కార్మికులు సకాలంలో ఔట్‌పాస్‌ లను పొందక.. సొంతగడ్డకు చేరుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కేంద్రం చొరవ తీసుకుని కువైట్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి  కార్మికులు సొంతూళ్లకు చేరు కునేలా చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.

ఇప్పటికే కువైట్‌లో తెలంగాణ కార్మికులకు సహకా రం అందించడానికి అక్కడికి వెళ్లిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ బృందం మన విదేశాంగ శాఖ ఉన్నతాధికారులను కలసి లేఖ అందించింది.  కార్మికుల సంఖ్యకు సరిపడే విమాన సర్వీ సులు లేకపోవడం,  విమానయాన చార్జీలు పెంచడం వల్ల కలిగిన అసౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌.సి.కుంతియా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. కువైట్‌లో ఉన్న భారత సంతతి చిన్నారులు అక్కడ జనన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా స్టేట్‌లెస్‌ చిల్డ్రన్‌గా పరిగణించబడి ఔట్‌పాస్‌లను పొందలేకపోతున్నారని తెలిపారు. చిన్నారులకు ఔట్‌పాస్‌లు లభించేలా కృషి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. 

మరిన్ని వార్తలు