కరోనా లక్షణాలుంటే సెలవు తీసుకోండి: డీజీపీ

11 Jun, 2020 10:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుశాఖలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్న దరిమిలా పోలీసుశాఖ అప్రమత్తమైంది. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల ఎస్పీలు/కమిషనర్లకు ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు జారీచేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పోలీసులు ఎనలేని సేవలందిస్తున్నారని, ఒకవేళ వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సెలవు తీసుకోవాలని సూచించా రు. ఉన్నతాధికారులు కూడా వెంటనే అనుమతివ్వాలని ఆదేశాల్లో స్పష్టంచేశారు.  

కరోనా బారిన84 మంది పోలీసులు!
పోలీసుశాఖలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తెలంగాణలో జూన్‌ 4వ తేదీ వరకు మొత్తం 84 మంది పోలీసు అధికారులకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని సమాచారం. కంటైన్మెంట్‌ జోన్లు, కోవిడ్‌ చికిత్సా కేంద్రాల్లో విధుల నిర్వహణ వల్లే వీరికి కరోనా పాజిటివ్‌ అని అనుమానిస్తున్నారు. వీరందరికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. వీరి కుటుంబ సభ్యులను హోమ్‌ క్వారైంటైన్‌లో ఉంచారు. 

మరిన్ని వార్తలు