ఆర్థిక మాంద్యంలోనూ బీసీ సంక్షేమానికి పెద్దపీట

10 Mar, 2020 02:38 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. చిత్రంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్‌

మీడియాతో మంత్రులు తలసాని, శ్రీనివాస్‌ గౌడ్, గంగుల

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్థికమాంద్యంలోనూ వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ 2020–21కు ఆర్థిక రంగ నిపుణులతో పాటు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నా యని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాద వ్, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్‌ తెలిపా రు. టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కార్యాలయంలో సోమవారం మంత్రులు మీడియాతో మాట్లాడా రు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు పెరిగాయని, 70 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతోం దని పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సబ్‌ప్లాన్‌ కంటే ఎక్కువ మేలు బీసీలకు కలిగేలా బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయని, కేసీఆర్‌ను బీసీలు శాశ్వతంగా గుర్తుకు పెట్టుకుంటారని అన్నారు.

గతంలో అంకెల కోసం బడ్జెట్‌ రూపొం దిస్తే, తాము ఆచరణ సాధ్యమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామన్నారు. బడ్జెట్‌ తీరుతెన్నులపై ప్రతిపక్షా లు అర్ధం లేని విమర్శలు చేస్తున్నాయని తలసాని వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యంలోనూ బీసీలు, అణగారిన వర్గాల కోసం రూ.30వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శా ఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. తాము బీసీ అనుకూల అనుకూల విధానాన్ని కొనసాగిస్తున్నందునే బీజేపీ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తోందన్నారు.దశాబ్దాల తరబడి కేంద్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్, బీజేపీ కనీసం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు.

కేసీఆర్‌ను మరో జ్యోతీరావు ఫూలేగా అభివర్ణించిన శ్రీనివాస్‌గౌడ్‌ పని చేసే వ్యక్తిని ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీని బీసీ వర్గాలు కక్ష కట్టి మరీ ఓడిస్తాయని హెచ్చరించారు. బీసీలకు సబ్‌ ప్లాన్‌ అవసరమనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దానిని భవిష్యత్తులో పరిశీలిస్తారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు.

ఎంబీసీలకు రూ.500 కోట్లు.. 
అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీ) చెందిన వారి కోసం రూ.500 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇంత పెద్దమొత్తంలో బీసీల సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయింపులు జరగలేదని, అనేక ఇతర పథకాల ద్వారా కూడా బీసీలకు మేలు కలుగుతుందన్నారు. బీసీ ఫెడరేషన్ల ఖాతాలో నిధులు లేవనే ఆరోపణలను ఖండిస్తూ, గీత కార్మికుల సంక్షేమానికి గతంతో పోలిస్తే నిధుల కేటాయింపు పెరిగిందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో వివిధ వర్గాలకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచేవని, కానీ తమ ప్రభుత్వ విధానం మాత్రం అన్నివేళలా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని గంగుల కమలాకర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు