'సినీ ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాదే'

5 May, 2020 12:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారితో సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోయిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. సినిమా, సీరియళ్ల షూటింగ్‌కు సంబంధించి త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుదంటూ ఇండస్ట్రీకి చెందిన పలువురు మంగళవారం తలసానిని కలిసి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. 'కరోనా వల్ల ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికి ఇబ్బంది, నష్టం కలిగిన మాట వాస్తవమే. కానీ త్వరలోనే మంచి రోజులు వస్తాయి. సినిమా, సీరియళ్ల షూటింగ్‌లపైనే ఆధార పడి చాలా మంది కార్మికులు బతుకుతున్నారు. వారందరికి రేషన్ కార్డుల ద్వారా ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం.అలాగే కరోనా క్రైసిస్‌ చారిటీ(సిసిసి) ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇప్పటివరకు సిసిసి ద్వారా 14 వేల మంది సినీ కార్మకులను ఆదుకోవడం గొప్ప విషయం. సినిమా పెద్దలతో మీటింగ్ లు జరిగాయి. కరోనాతో బ్రేక్ పడింది.. కానీ బెస్ట్ పాలసీ తో ముందుకు వస్తాం. లాక్‌డౌన్‌ తర్వాత ఇండస్ట్రీ తో చర్చలు జరుపుతాం. సింగిల్ విండో పాలసీ తో ముందుకు వెళ్తాము. షూటింగ్ విషయం లో ఒక నిర్ణయం తప్పకుండా తీసుకుంటాం. జూన్ నుంచి షూటింగ్ లు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై రెండు రాష్ట్రాలు చర్చించి త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తాం' అంటూ తలసాని పేర్కొన్నారు.

సినీ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ... చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీకి లీడ్ తీసుకొని చెయ్యడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు . ఇప్పటివరకు 14వేల మంది సినీ వర్కర్స్ కి నిత్యావసరాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికీ వైజాగ్, విజయవాడ, తిరుపతి లో కూడా వున్న సినీ వర్కర్స్ కి ఇచ్చామని, ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ సీసీసీ సహాయం చేస్తుందని వెల్లడించారు. లాక్ డౌన్ తరువాత చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వం తో చర్చలు జరుపుతామని తెలిపారు.
(ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు..)
(‘జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగితే గయ్యిమని ఎగవడకు’)

మరిన్ని వార్తలు