రాజ్‌భవన్‌లో ఎట్‌హోం

27 Jan, 2020 04:33 IST|Sakshi
ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై దంపతులు, సీఎం కేసీఆర్‌. చిత్రంలో జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఇతర ప్రధాన పార్టీల నాయకులు

సాక్షి, హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దంపతులు ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, హైకోర్టు చీఫ్‌జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళి సై అతిథులకు తేనీటి విందునిచ్చారు. సీఎం, సీజేతో కలసి ఆమె అతిథులందరి వద్దకు వెళ్లి అభివాదం తెలిపారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన హైదరాబాద్‌ నగరవాసి చింతల వెంకట్‌ రెడ్డి దంపతులతో పాటు రాష్ట్రపతి సేవా పురస్కారానికి ఎంపికైన ఇంటెలిజెన్స్‌ మాజీ ఐజీ శివధర్‌ రెడ్డిలను గవర్నర్‌ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడవెంకట్‌ రెడ్డి, ఎంపీలు సంతోష్, రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్,   డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రగతి భవన్‌లోగణతంత్ర దినోత్సవం 
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ప్రగతి భవన్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి పరేడ్‌ గ్రౌండ్‌లోని సైనిక అమర వీరుల స్థూపాన్ని సందర్శించి అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు