యోగాకు ‘సై’ అనండి!

20 Sep, 2019 03:18 IST|Sakshi
రాజ్‌భవన్‌లో గురువారం యోగా శిబిరంలో సాధన చేస్తున్న గవర్నర్‌ తమిళి సై

గవర్నర్‌ తమిళిసై సూచన

శారీరక శ్రమకు దూరమయ్యారు

నడవడం కూడా మానేశారు 

ఫిట్‌ ఇండియా ఉద్యమానికి బలం చేకూర్చండి 

సోమాజిగూడ: ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగ సాధనను చేయాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. రాజ్‌భవన్‌ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా యోగా తరగతులను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 5.30 నుంచి 6.30 వరకు సాంస్కృతిక భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ తరగతులను గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా..సమాజంలో చాలా మంది శారీరక శ్రమకు దూరమయ్యారని, కనీసం నడవడం కూడా మానుకున్నారన్నారు. ప్రతిరోజూ గంటపాటు తాను యోగా సాధన చేస్తానని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఫిట్‌ ఇండియా ఉద్యమానికి బలం చేకూర్చేలా ప్రతిరో జూ అందరం యోగా చేద్దామన్నారు. తెలంగాణ లోని ప్రజలంతా యోగా ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత దీన్ని నిత్యకృత్యం చేసుకోవాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. 

రాజ్‌భవన్‌ పాఠశాలలో... 
రాజ్‌భవన్‌ ప్రభుత్వ స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 450 మంది విద్యార్థులకు ప్రతి శనివారం యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు. ఫిట్నెస్‌ పై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాజ్‌భవన్‌ స్కూల్లో  యోగా గురువు రవికిషోర్‌ శిష్య బృందం పర్యవేక్షణలో యోగా తరగతులను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గవ ర్నరు కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, సలహాదారు ఎ.పి.వి.యన్‌.శర్మ, జాయింట్‌ సెక్రటరీ భవానీ శంకర్, డిప్యూటీ సెక్రటరీ రఘుప్రసాద్‌ తదితర 200 మంది సిబ్బంది పాల్గొన్నారు.  


 

మరిన్ని వార్తలు