సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలోని వైమానిక సెజ్లో టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెని గురువారం ప్రారంభమైంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో 14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కంపెనీని తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, ఎంపీలు కొండావిశ్వేశ్వర్రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టాటా బోయింగ్ ఏరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్లో హెలికాప్టర్లకు, ఎస్ ఆర్మీ యుద్ధ హెలికాప్టర్ల విడిభాగాలు ఇక్కడ తయారుకానున్నాయి. ముఖ్యంగా బోయింగ్ ఏహెచ్ 64 విమానాల విడిభాగాలకు తోడు అపాచీ హెలికాప్టర్లను కూడా తయారుచేయనున్నారు. తద్వారా 350 మందికి ఉపాధి అవకాశాలు లభించనుంది. కాగా విమాన విభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్ 18న అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, టాటా గ్రూపుల చైర్మన్ రతన్ టాటా, తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, బోయింగ్ సంస్థలు కలిసి టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్ ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేశాయి.