కాంగ్రెస్ పార్టీలో జిల్లానుంచి ఢిల్లీ వరకు జరుగుతున్న కసరత్తు ఆ పార్టీ నాయకుల అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 నియోజకవర్గాల నుంచి పోటాపోటీగా అధిష్టానానికి దరఖాస్తు చేస్తున్నారు. రెండుచోట్ల మాత్రమే ఒక్కొక్క పేరు ఉండగా.. మిగతా స్థానాల్లో ఆశావహులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై తమ ప్రతిపాదనలను పంపాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవలే ఏఐసీసీ కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి శ్రీనివాస కృష్ణన్ రెండు పర్యాయాలు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పొత్తు నేపథ్యంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఇటీవలే చర్చలు జరిపారు. గెలిచే స్థానాలు మినహా మిగతా చోట్ల ఇతర పార్టీలకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఆ పార్టీ అధినేత రాహుల్గాంధీ ముగ్గురు సభ్యులతో అభ్యర్థుల ఎంపిక చైర్మన్గా భక్తచరణ్దాస్, సభ్యులుగా శర్మిష్ఠముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమైలతో స్క్రీనింగ్ కమిటీ వేయడం.. ఆ కమిటీ 25న హైదరాబాద్లో పార్టీ నేతలతో సమావేశం కానుండడంతో ఆశావహుల్లో అలజడి మొదలైంది. ఈనెల 25న హైదరాబాద్కు రానున్న స్క్రీనింగ్ కమిటీ పార్టీనేతలతో సమావేశం కానుంది.
ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల నుంచి అందిన ఆశావహుల దరఖాస్తులు, ముఖ్యనేతలు, డీసీసీ కమిటీలు సిఫారసు చేసిన పేర్లపై చర్చించి.. పోటీ ఉన్న సెగ్మెంట్లలో ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున పేర్లను అధినేత రాహుల్గాంధీకి సిఫారసు చేయనున్నారని చెప్తున్నారు. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే, తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్రెడ్డి (జగిత్యాల), మాజీమంత్రి డి.శ్రీధర్బాబు (మంథని) స్థానాలకు ఒక్కొక్క పేరే ఉండగా, మిగతా చోట్ల మూడు నుంచి ఎనిమిది మంది వరకు టికెట్ ఆశిస్తున్నారు. ముందస్తుగా టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారాన్ని నిర్వహించగా.. కాంగ్రెస్ పొత్తులు, టికెట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
పొత్తులలో నాలుగు స్థానాల్లో కిరికిరి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్ నేతలతో చర్చలు జరిపింది. టీడీపీ పొత్తుల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలు, సీపీఐ, టీజేఎస్ పార్టీలు తలో సీటును కోరుతున్నట్లు చెప్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కోసం హుజూరాబాద్, కోరుట్ల స్థానాల నుంచి టికెట్ అడుగుతున్నట్లు సమాచారం. హుస్నాబాద్ స్థానాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి ఇవ్వడం అనివార్యమంటున్నారు. ఇదే సమయంలో టీజేఎస్కు ఇచ్చే స్థానాల్లో హుజూరాబాద్ను కూడా అడుగుతున్నట్లు చెప్తున్నారు. ఒకవేళ ఈ జిల్లా నుంచి టీడీపీ ఒకటే స్థానాన్ని కోరితే... హుజూరాబాద్ను టీజేఎస్ జిల్లా కన్వీనర్ ముక్కెర రాజుకు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పొత్తులో భాగంగా టీడీపీకి రెండు స్థానాలు ఇస్తే హుజూరాబాద్, కోరుట్లలో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు నిరాశే మిగలనుంది. హుస్నాబాద్ పరిస్థితి కూడా అంతే కానుండగా.. పొత్తులలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు వదులుకుంటుందన్న చర్చ ఇప్పుడా పార్టీ నేతల్లో హాట్టాఫిక్గా మారింది.
కాంగ్రెస్లో ఎక్కడి నుంచి ఎవరు..?
పొత్తులు, సీట్ల కేటాయింపు ఇంకా స్పష్టత రాకపోగా.. జగిత్యాల, మంథని మినహా 11 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 8 మంది నుంచి 10 మంది పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలు పరిశీలిస్తే..