హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల నంచి సస్పెండైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్రబాబుతో వారు సోమవారం రాత్రి చర్చించారు. శాసనసభలో మాట్లాడే అవకాశం లేకుండా సస్పెండ్ చేసినప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడమే మార్గమని సూచించినట్టు తెలిసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రజా సమస్యలపై ప్రతీరోజు చర్చ ఉండే విధంగా ప్రత్యక్ష కార్యాచరణపై ప్రణాళిక రూపొందించుకోవాలని చంద్రబాబు సూచించారు. దీనికోసం మంగళవారమే భేటీ కావాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. అలాగే గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. తర్వాత జిల్లాల వారీగా బస్సు యాత్రలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్రావు, మోత్కుపల్లి నర్సింహులు, అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.