ప్రాజెక్ట్‌వర్క్ చేయలేదని కొట్టడంతో..

22 Sep, 2015 16:06 IST|Sakshi

బెల్లంపల్లి (ఆదిలాబాద్) : ప్రాజెక్ట్ వర్క్ ఎందుకు చేయలేదని ఉపాధ్యాయురాలు కొట్టడంతో ఇంటకి వెళ్లిన విద్యార్థి బంధువులకు విషయం చెప్పి పిలుచుకొని వెళ్లాడు. పాఠశాలకు వెళ్లిన బంధువులతో ఉపాధ్యాయురాలు దురుసుగా మాట్లాడటంతో పాటు.. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కోపోద్రిక్తులైన విద్యార్థి బంధువులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఉపాధ్యాయురాలిపై దాడి చేసి పాఠశాలలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ ఏరియాలోని సెయింట్ విన్‌సెంట్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగింది.

పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సమీర్(14) వారం రోజులుగా ప్రాజెక్ట్ వర్క్ సబ్‌మిట్ చేయకపోవడంతో.. సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలు రాణి విద్యార్థిపై చేయి చేసుకుంది. అంతే కాకుండా ఈ అంశాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా విద్యార్థిని కొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పాఠశాలకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు దురుసుగా ప్రవర్తించడంతో కోపోద్రిక్తులైన బాధితులు పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు