హైదరాబాద్‌లో టీచర్‌ ఎమ్మెల్సీ ఓట‍్ల లెక్కింపు

22 Mar, 2017 09:21 IST|Sakshi

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ కోసం 28 టేబుళ్లను ఏర్పాటుచేసి సిబ్బందిని మూడు షిఫ్టుల్లో పనిచేసేలా నియమించారు. ఒక్కో షిఫ్టులో 30మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 90మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. లెక్కింపు ప్రక్రియను సీసీ టీవీల ద్వారా ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షిస్తుంది.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకుగాను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు ప్రత్యేక గుర్తింపుకార్డులు అందజేశారు. ఎన్నికల సంఘం పరిశీలకులు రజత్‌కుమార్ పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉన్నప్పటికీ అవి లేనందున నేరుగా బ్యాలెట్ పత్రాల లెక్కింపును చేపట్టారు. బ్యాలెట్ పత్రాలను 25 లేక 50 చొప్పున కట్టలుగా కట్టి లెక్కిస్తారు. 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు ఒక అభ్యర్థికి పోలైతే విజేతగా ప్రకటిస్తారు. లేనిపక్షంలో ప్రాధాన్యతాక్రమంలో ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ రౌండ్ చేపడతారు.

మరిన్ని వార్తలు