గురువులే మార్గదర్శకులు

6 Sep, 2018 07:29 IST|Sakshi
ఏన్కూరు గ్రేడ్‌–1హెచ్‌ఎం ఎ.శైలను సత్కరిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ కవిత, చిత్రలో డీఈఓ మదన్‌మోహన్, తదితరులు

ఖమ్మంసహకారనగర్‌: ఈ సమాజంలో గురువులే మార్గదర్శకులని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత అన్నారు. ఉపాధ్యాయులు వృత్తికే వన్నె తీసుకొస్తారని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని తెలిపారు. బుధవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. డీఈఓ పి.మదన్‌మోహన్‌ అధ్యక్షతన మిగతా జిల్లా వ్యాప్తంగా 29మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలన్నారు. జిల్లాలో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు.

నూటికినూరు శాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయుల బోధన విధానం ఉండాలన్నారు. మరింత నాణ్యమైన, మెరుగైన విద్యను అందించడమే లక్ష్యమన్నారు. పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని, అందుకనుగుణంగా విద్యాశాఖ, ఉపాధ్యాయులు శ్రద్ధ పెంచాలన్నారు. అప్పుడే ఆశించిన లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కమర్, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ చేతుల నాగేశ్వరరావు, ఏడీ మురళీకృష్ణ, ఖమ్మంఅర్బన్‌ ఎంఈఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు