సాక్షి, హైదరాబాద్ : ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలను తీసుకునే అధికారం లేనప్పటికీ అడ్డదారి బదిలీలకు విద్యాశాఖ తెరలేపింది. ఒకవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, మరోవైపు టీచర్ల బదిలీలపై నిషేధం ఉండగా పైరవీలకు తలొగ్గింది. నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది జూన్లో సాధారణ బదిలీలు జరిగాయి. దాదాపు 74 వేల మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా 46 వేల మందికి స్థానచలనం కలిగింది. ఇందులో దాదాపు వంద మంది టీచర్లు తమ బదిలీల్లో తప్పులు దొర్లినట్లు పేర్కొంటూ విద్యాశాఖకు అప్పీళ్లు చేసుకున్నారు. వీటిని పక్షంరోజుల్లో పరిశీలించి పరిష్కరించాల్సి ఉండగా మూడు నెలలు కావస్తున్నా పట్టించుకోకపోగా దొడ్డిదారి బదిలీలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నలుగురు టీచర్లకు వరుసగా బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేయడం విద్యాశాఖ వర్గాల్లో దుమారం రేపుతోంది. వీరిలో ముగ్గురు టీచర్లకు అంతర్ జిల్లా బదిలీలు కాగా, మరో టీచర్కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో స్థానచలనం కలిగింది. ఒక టీచర్ను మాత్రం ఏకంగా జిల్లా పరిషత్ యాజమాన్యం నుంచి ప్రభుత్వ యాజమాన్యానికి బదిలీ చేయడం గమనార్హం. మరో 22 మంది టీచర్లకు ప్రత్యేక బదిలీలు కలిగించేందుకు విద్యాశాఖలో పైరవీలు వేగవంతమయ్యాయి.
నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు...
పైరవీలకు తలొగ్గి
ఆపద్ధర్మ ప్రభుత్వంలో జరిగిన బదిలీల వెనుక కొందరు కీలక వ్యక్తులు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. సిద్దిపేట్ జిల్లా నుంచి హైదరాబాద్కు బదిలీ అయిన టీచర్ బదిలీ విషయంలో విద్యాశాఖ అధికారులపై సీఎం ఓఎస్డీ ఒత్తిడి చేసినట్లు సమాచారం. మహబూబ్నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన టీచర్ విష యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సిఫారసు ఆధారంగా బదిలీ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. వికారాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డికి బదిలీపై వచ్చిన టీచర్ విషయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సిఫారసు ఆధారంగా బదిలీ చేసినట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. అంతర్జిల్లా బదిలీ విషయంలో భారీగా లావాదేవీలు జరిగినట్లు విద్యాశాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక కేటగిరీల బదిలీలు కావడంతో పెద్దమొత్తంలోనే ముడుపులు చెల్లించినట్లు ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి. జూన్లో సాధారణ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే రెండ్రోజుల ముందు కూడా ఇదే తరహాలో వంద మంది టీచర్లకు దొడ్డిదారిలో బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.