జిల్లాలో చీలిన ‘తపస్‌’

27 Oct, 2019 11:13 IST|Sakshi
భారతీయ ఉపాధ్యాయ సంఘ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు

భారతీయ ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావం 

రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం: కన్వీనర్‌ శ్రీనాకర్‌రెడ్డి 

సిద్దిపేటఎడ్యుకేషన్‌ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌)కు మూకుమ్మడిగా రాజీమానామాలు చేసిన ఆ సంఘం రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక సభ్యులు పలువురు శుక్రవారం రాత్రి భారతీయ ఉపాధ్యాయ సంఘం పేరుతో నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం నూతన సంఘం కన్వీనర్‌ పబ్బతి శ్రీనాకర్‌రెడ్డి మాట్లాడుతూ తపస్‌ జిల్లా శాఖలో ఏడాదిగా జరిగిన పరిణామాలను ఎప్పటికప్పుడు రాష్ట్రశాఖ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇటీవల జరిగిన సంఘం జిల్లా ఎన్నికల విషయంలో సైతం అవకతవకలు జరిగియాని ఆరోపించారు. దీంతో తాము తీవ్ర మనస్థాపానికి గురై తప్పనిసరి పరిస్థితుల్లో నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. భారతీయ ఉపాధ్యాయ సంఘం దేశం కోసం నిలబడుతుందని చెప్పారు. విలువలను పెంపొందిస్తూ దేశభక్తిని కలిగి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు.

కేవలం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడతామని పేర్కొన్నారు. తమ సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. అందులో భాగంగా త్వరలో పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకుని అన్ని జిల్లాల్లో పర్యటించి సమావేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఉపాధ్యాయున్ని కలిసి తమ సంఘం విధి విధానాలు, చేపట్టే కార్యక్రమాలను వివరించి అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్లు మొలకంల శ్రీనివాస్, ధరవాత్‌ రమేశ్, వైవి శశికుమార్, గడీల శ్రీకాంత్, ప్రవీణ్, బి. శశికుమార్, బొజ్ఞ అశోక్, సభ్యులు సింగోజు జనార్థన్, వంగ నర్సిరెడ్డి, కొండం మధుసూధన్‌ రెడ్డి, నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, రిక్కల రవీందర్‌రెడ్డి, 20 మంది సభ్యులు పాల్గొన్నారు 

మరిన్ని వార్తలు