కృష్ణా జలాల కోసం బోర్డుకు ఇండెంట్లు సమర్పించిన ఇరు రాష్ట్రాలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డుకు సవరించిన ఇండెంట్లను సమర్పించాయి. కృష్ణా నీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాలు ఇదివరకే ఇండెంట్లు సమర్పించగా.. తాజాగా ప్రాజెక్టుల్లో నీటి చేరిక నేపథ్యంలో మార్పులు చేశాయి.
ఈ మేరకు సోమవారం ఇరు రాష్ట్రాలు కొత్త ఇండెంట్లతో బోర్డుకు లేఖలు రాశాయి. గతంలో తెలంగాణ 122 టీఎంసీల మేర కోరగా.. తాజాగా 138.50 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో సాగర్ కింద జోన్–1, 2లలో అవసరాలకు 54.50 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 14, మిషన్ భగీరథకు 15, కల్వకుర్తికి 25 టీఎంసీలు ఇవ్వాలని కోరింది.
ఇక ఏపీ మొత్తంగా 270 టీఎంసీలు కావాలని కోరింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం, సాగర్లలో కనీస నీటిమట్టాలకు ఎగువన 289 టీఎంసీల మేర లభ్యత జలాలు ఉంటాయని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇరు రాష్ట్రాలు కలిపి 408 టీఎంసీల మేర అవసరాలను పేర్కొన్నాయి.