లిక్కర్‌ ‘లిక్విడ్‌’పై అంచనా.. 16 వేల కోట్లు

9 Mar, 2020 02:42 IST|Sakshi

ఈసారి భారీగా పెరిగిన ఎక్సైజ్‌ ఆదాయ అంచనాలు

ఇటు పెరిగిన అన్ని రకాల పన్ను అంచనాలు

పన్నేతర ఆదాయం కూడా భారీగా పెంపు

30% 2019–20తో పోలిస్తే అధికం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై భారీ అంచనాలే పెట్టుకుందని బడ్జెట్‌ ప్రతిపాదనలు చెబుతున్నాయి. 2019–20 సంవత్సరంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ద్వారా రూ.10,637 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.12,600 కోట్లు ఆదాయం వస్తుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. దీంతో 2020–21కి దీనికి దాదాపు 30 శాతం అదనంగా రూ.16 వేల కోట్ల అంచనాలను ప్రతిపాది ంచారు. అలాగే అన్ని రకాల పన్ను అంచనాలు కూడా ఈసారి పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. పన్నుల్లో కేంద్ర వాటాతో సహా రాష్ట్ర పన్నులు (జీఎస్టీతో కలిపి), అమ్మకపు పన్ను, వాణిజ్య పన్ను, ఇతర పన్నులను కూడా పెంచుతూ 2020–21 బడ్జెట్‌ అంచనాలు ప్రతిపాదించారు. పన్ను ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయంపై కూడా ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకుంది. 2019–20 సంవత్సరంలో పన్నేతర ఆదాయం కింద రూ.10,007 కోట్ల ఆదాయం అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో రూ.12,275 కోట్లుగా పేర్కొంది. అయితే అంచనాలకు అందని విధంగా ఈసారి 2020–21 బడ్జెట్‌లో పన్నేతర ఆదాయ అంచనాను రూ.30,600 కోట్లుగా చూపెట్టింది. ఆదాయ పెంపు మార్గాలపై ప్రభుత్వం స్పష్టతకు వచ్చిందని, అందుకే పన్నేతర ఆదాయాన్ని 150 శాతం వరకు పెంచిందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర పన్నులపై ఆశ..
ఇటు కేంద్ర పన్నులపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ తగ్గలేదు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.18,560 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో అది రూ.15,987 కోట్లు మాత్రమే వచ్చింది. దీనికి కొంత అదనంగా 2020–21 బడ్జెట్‌లో కేంద్ర పన్నుల వాటా కింద రూ.16,726 కోట్లు ప్రతిపాదించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లో 2019–20 సవరించిన అంచనాల కంటే తక్కువగానే 2020–21 సంవత్సరానికి అంచనా వేసింది.

మరిన్ని వార్తలు