4 రోజులు ముందుగానే...

16 Mar, 2020 02:59 IST|Sakshi

నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉభయ సభల్లో తీర్మానం

ద్రవ్య వినిమయ బిల్లు అనంతరం వాయిదా పడనున్న అసెంబ్లీ

స్పీకర్‌ పోచారం సమక్షంలో అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్ల భేటీ.. కుదింపుపై నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 6న ప్రారంభమైన అసెంబ్లీ వార్షిక బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ముగియనున్నాయి. కోవిడ్‌పై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఈ నెల 20 వరకు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సం బంధించి ఆదివారం సాయంత్రం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి చాంబర్‌లో శాసనసభ ఫ్లోర్‌ లీడర్ల సమావేశం జరిగింది. మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, హరీశ్‌రావు, ఎంఐఎం, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. కోవిడ్‌పై ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. 

దీంతో శాసనసభ, మండలి రెండూ సోమవారం ఉదయం 11 గంటలకు వేర్వేరుగా సమావేశమవుతాయి. చివరి రోజు సమావేశంలో అత్యంత కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) బిల్లును ప్రవేశపెడతారు. దీనిపై చర్చించిన తర్వాత తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర బిల్లులతో పాటు, సీఏఏ వ్యతిరేక తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తరువాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తారు. అనంతరం మండలి కూడా సీఏఏ వ్యతిరేక తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది. 

పద్దులపై చర్చ...
అసెంబ్లీ సమావేశ తేదీల కుదిం పు నేపథ్యంలో ఆదివారం బడ్జె ట్‌ పద్దులపై చర్చ జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబం ధించిన 25 పద్దులపై పలు పార్టీ లకు చెందిన 23 మంది సభ్యులు ప్రసంగించారు. ఆదివారం ఉదయం 11గంటలకు పద్దులపై మొదలైన చర్చ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రుల సమాధానాలు చెప్పారు.

మరిన్ని వార్తలు