‘జీ+1 బిల్డింగ్‌ రిజిస్ట్రేషన్‌ ఒక్కరూపాయికే’

19 Jul, 2019 11:25 IST|Sakshi

శాసనసభలో మున్సిపల్‌ బిల్లుపై చర్చ

నిధులు, అధికారాలు మున్సిపాలిలకే :  కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ చట్టంపై రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ‘పంచవర్ష ప్రణాళికలను ప్రజాప్రతినిధులు అధ్యయనం చేయాలి. మనది బలమైన పునాదులున్న ప్రజాస్వామ్యం. మున్సిపల్‌ చట్టాన్ని పారదర్శకంగా రూపొందించాం. నిధులు, అధికారాలు మున్సిపాలిటీలకే. కొన్ని అధికారాలను కలెక్టర్లకు కేటాయించాం. ప్రతి మున్సిపల్‌ వార్డులో ప్రజాదర్బారు ఉంటుంది.  అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ కూడా పద్ధతిగా ఉండాలి. ప్రతియేడు రూ.3,200 కోట్ల నిధులు గ్రామాలకు వెళ్తాయి. 500 జనాభా ఉండే పంచాయతీకి కనీసం రూ.5 లక్షలు అందిస్తాం. పట్టణాలకు రూ.2,060 కోట్లు వెళ్తాయి.

500 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు మున్సిపల్‌ ఆఫీసుల చట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఇకపై 128 మున్సిపాలిలు ఉంటాయి. నగర పంచాయతీలు ఉండవు. మున్పిపాలిటీల్లో ఆస్తిపన్ను కట్టకుండా అబద్ధాలు చెబితే 25 రెట్ల జరిమానా విధిస్తాం.  ఎన్నికల నిర్వహణలో ఈసీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కేవలం ఎన్నికల తేదీలను మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తుంది. మున్సిపల్‌ వ్యవస్థను అవినీతి రహితం చేయడమే లక్ష్యం. 75 చదరపు గజాల్లోపు ఉన్న ఇల్లుకు ఏడాదికి రూ.100 పన్ను చెల్లించాలి. 75 చదరపు గజాల్లోపు జీ+1 కడితే అనుమతి అవసరం లేదు. ఒక్క రూపాయితోనే రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎక్కడా అనుమంతించం. అక్రమ నిర్మాణమని తెలిస్తే వెంటనే కూల్చేస్తాం. ఎలాంటి నోటీసులు ఇవ్వం’అన్నారు.

>
మరిన్ని వార్తలు