విమోచనం’ నిర్వహించే వరకు ఉద్యమం

16 Sep, 2017 03:33 IST|Sakshi
విమోచనం’ నిర్వహించే వరకు ఉద్యమం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

సూర్యాపేట అర్బన్‌: తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు ఉద్యమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో సూర్యాపేట ఆర్‌డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ అమరవీరుల త్యాగాలు వృథా అవుతున్నాయని, వాటి గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరముందని చెప్పారు. అమరుల వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేసి నేటి యువతకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. అధికారంలోకి రాగానే విమోచనా దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు మజ్లిస్‌ పార్టీకి భయపడి మాట మార్చారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. వారం రోజులపాటు విమోచన దినం కోసం యాత్ర నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామన్నారు. రైతు సమన్వయ సమితుల కోసం తెచ్చిన జీఓ 39 ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, పరిస్ధితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు వెంటనే లక్ష్మణ్, సంకినేని వెంకటేశ్వరరావులను అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

మరిన్ని వార్తలు