మాంద్యం ముప్పు.. మస్తుగా అప్పు

10 Sep, 2019 02:46 IST|Sakshi

1,46,492.3  కోట్ల రాష్ట్ర బడ్జెట్‌

రాష్ట్ర ఆదాయ వనరులపై తిరోగమన ప్రభావం

ప్రభుత్వ బడ్జెట్‌ లెక్కలు తారుమారు

ఓటాన్‌ అకౌంట్‌కన్నా రూ. 36 వేల కోట్ల తగ్గుదల

గతేడాది కన్నా అంచనాల్లో రూ. 28 వేల కోట్ల కోత

రూ. 4 వేల కోట్లు తక్కువగా రాబడి అంచనా

రాష్ట్ర మనుగడకు అప్పులు, భూముల విక్రయాలే శరణ్యం

సాక్షి, హైదరాబాద్‌ : బడ్జెట్‌ ప్రతిపాదనలనుబట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థిక మాంద్యం ముంచేసిందని అర్థమవుతోంది. పన్ను రాబడుల్లో తగ్గిన వృద్ధి రేటు, ఆదాయ వనరులపై తిరోగమన ప్రభావం కారణంగా ఈ ఏడాది బడ్జెట్‌ లెక్కలు తారుమారయ్యాయి. ఆరు నెలలకుగాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌కన్నా రూ. 36 వేల కోట్ల మేర బడ్జెట్‌ ప్రతిపాదనలు తగ్గిపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన నాటి నుంచి మొదటి ఏడాది మాత్రమే కేంద్రం నుంచి రాష్ట్రం పరిహారం తీసుకోగా ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు దాదాపు రూ. 875 కోట్లను కేంద్రం నుంచి పరిహారం కింద తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొనడం ఆర్థిక మాంద్య ప్రభావాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో చూపిన రూ. 33 వేల కోట్లకుపైగా అప్పులు, సీఎం తన ప్రసంగంలో చెప్పినట్లు భూముల విక్రయాల ద్వారానే రాష్ట్ర మనుగడ ఆధారపడేలా కనిపిస్తోంది. మరోవైపు పన్ను రాబడిపై ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకున్నా పురోగతి కనిపించే పరిస్థితి లేకపోవడంతోనే విధిలేని పరిస్థితుల్లో బడ్జెట్‌ను తగ్గించి చూపారని ఆర్థిక నిపుణులంటున్నారు.

పన్ను అంచనాల్లోనూ తిరోగమనమే...
ఈ ఏడాది బడ్జెట్‌ లెక్కలనుబట్టి చూస్తే పన్ను అంచనాలు కూడా తగ్గిపోయాయి. గతేడాది రెవెన్యూ ఆదాయం కింద రూ. 1.30 లక్షల కోట్లు చూపగా సవరించిన అంచనాల్లో అది రూ. 1.19 లక్షల కోట్లకు తగ్గింది. ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల్లోనే రూ. 1.13 లక్షల కోట్లను రెవెన్యూ రాబడుల కింద చూపడం గమనార్హం. ఈ ఏడాది పన్ను రాబడిలో కూడా పురోగతి ఉండదనే ఆలోచనతోనే బడ్జెట్‌ను కుదించారని అర్థమవుతోంది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే అప్పులు రూ. 9 వేల కోట్లు తక్కువగా చూపగా మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ. 36 వేల కోట్ల మేర తగ్గిపోయాయి.

అంటే పన్ను, పన్నేతర రాబడులు ఆ మేరకు తగ్గిపోవచ్చనే అంచనాతోపాటు అంతకన్నా ఎక్కువ అప్పులు కూడా లభించే పరిస్థితి లేకపోవడం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గుతాయనే అంచనాలతోనే బడ్జెట్‌ను తక్కువ చేసి చూపారని ఆర్థిక నిపుణులంటున్నారు. పన్ను రాబడులను పరిశీలిస్తే ఈసారి రూ. 69,328.57 కోట్ల మేర పన్నుల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది అంచనాలతో పోలిస్తే ఇది రూ. 4 వేల కోట్లు తక్కువ. అయితే పన్నేతర రాబడులు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది అంచనాల్లో పన్నేతర రాబడులను రూ. 8,973 కోట్లుగా చూపగా సవరించిన అంచనాలకు వచ్చేసరికి అది కాస్తా రూ. 6,347 కోట్లకే పరిమితమైంది. కానీ ఈసారి మాత్రం పన్నేతర రాబడుల కింద ఏకంగా రూ. 15 వేల కోట్లకుపైగా చూపడం గమనార్హం. 

కేంద్రం వాటా ఎక్కువే...
పన్ను రాబడిలో కేంద్రం వాటా గతేడాదికన్నా ఎక్కువే వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది రూ. 17,906 కోట్ల మేర పన్నులు, డ్యూటీల రూపంలో కేంద్రం నుంచి వాటాగా రాగా, ఈసారి రూ. 19,718 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అలాగే రాష్ట్ర పన్నుల కింద గతేడాదికన్నా రూ. 3 వేల కోట్లు ఎక్కువగా రూ. 69,328 కోట్లు, విక్రయాలు, వ్యాపార పన్నుల కింద రూ. 47,789 కోట్లు, ఎక్సైజ్‌శాఖ నుంచి రూ. 10,901 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో ఎక్సైజ్‌ మినహా ప్రతి రాబడిలోనూ గతేడాదికన్నా ఎక్కువగానే వస్తుందని ప్రతిపాదించారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ద్వారా గతేడాది రూ. 10,313 కోట్ల రాబడి నమోదవగా ఈసారి అది రూ. 10,901 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్‌ లెక్కల్లో చూపారు.

ఖర్చులూ తక్కువే...
రాబడులు తక్కువగా ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఈసారి రెవెన్యూ ఖర్చులను కూడా తక్కువ చూపారు. గతేడాది రూ. 1.25 లక్షల కోట్ల నికర ఖర్చును అంచనాల్లో చూపగా ఈసారి అంచనాల్లో దాన్ని రూ. 1.11 లక్షల కోట్లకు తగ్గించారు. ఇక మూలధన వ్యయంలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది అంచనాల్లో రూ. 33 వేల కోట్లకుపైగా మూలధన వ్యయాన్ని ప్రతిపాదిస్తే ఈసారి దాన్ని దాదాపు సగం... అంటే రూ. 17,274 కోట్లకు తగ్గించడం గమనార్హం. అయితే రుణాలు, అడ్వాన్సుల కింద చెల్లింపులు, తాత్కాలిక రుణ చెల్లింపులు, ఇతర రుణ చెల్లింపులను మాత్రం గతేడాదితో పోలిస్తే ఎక్కువగా చూపెట్టారు. 

లోటు బడ్జెట్‌ రూ. 24 వేల కోట్ల పైమాటే...
ఈసారి ప్రతిపాదనల్లో రూ. 24,081 కోట్లను ద్రవ్యలోటుగా చూపారు. గతేడాది ప్రతిపాదనల్లో రూ. 29 వేల కోట్లకుపైగా ద్రవ్యలోటు ఉండగా ఏడాది ముగిసేసరికి అది రూ. 28,722 కోట్లకు తగ్గింది. అయితే ఈసారి అందులో రూ. 4,700 కోట్ల మేర లోటు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసి ఈ మేరకు బడ్జెట్‌ అంచనాల్లో ప్రతిపాదించింది. ఇక రెవెన్యూ మిగులు విషయానికి వస్తే రూ. 2,044 కోట్లను మిగులు బడ్జెట్‌గా చూపింది.

అప్పులు, భూముల విక్రయాలే దిక్కు...
బడ్జెట్‌ ప్రతిపాదనలు, సీఎం ప్రసంగాన్నిబట్టి చూస్తే ఈ ఏడాది అప్పులు, భూముల విక్రయాలపైనే రాష్ట్ర ప్రభుత్వం కాలం గడపాల్సి వస్తుందని అర్థమవుతోంది. తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం ఈసారి మొత్తం బడ్జెట్‌లో 20 శాతానికిపైగా ఎక్కువ మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ. 33,444 కోట్ల రుణాలను ప్రతిపాదించింది. గతేడాదితో పోలిస్తే ఇది తక్కువే అయినా ఆ మేరకు మొత్తం బడ్జెట్‌ కూడా తగ్గిపోవడంతో గతేడాది తరహాలోనే ఈసారి కూడా అప్పులను ప్రతిపాదించింది. అదేవిధంగా రూ. వేల కోట్ల విలువైన భూముల విక్రయాల ద్వారా అదనపు ఆదాయం తీసుకొచ్చి ప్రజల అవసరాలను తీరుస్తామని, ఏ శాఖలో ఇబ్బంది కలిగినా సర్దుబాటు చేస్తామని సీఎం బడ్జెట్‌ ప్రసంగంలోనే చెప్పడం గమనార్హం. దీంతో అప్పులు, భూముల విక్రయాలపైనే ఆధారపడి ఈ ఆర్థిక సంవత్సరం ముందుకెళ్తుందనే భావన ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.

రాష్ట్ర బడ్జెట్‌లో భారీ కోత..
ఓటాన్‌ అకౌంట్‌లో రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా పూర్తి స్థాయి బడ్జెట్‌కు వచ్చేసరికి అది రూ.1.46,492.3 కోట్లకు తగ్గి పోయింది. అదే 2018– 19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అంచనాల బడ్జెట్‌లోరూ.28 వేల కోట్ల తగ్గుదల కనిపిస్తోంది. 2018– 19గాను రూ. 1.74 లక్షల కోట్ల అంచనాలను ప్రతిపాదించగా సవరించిన అంచనాల్లో అది రూ. 1.61 లక్షల కోట్లకు తగ్గింది. ఇప్పుడు ప్రతిపాదించిన రూ. 1.46 లక్షల కోట్ల ప్రతిపాదనలు కూడా సవరించిన అంచనాలకు వచ్చేసరికి ఎంత తగ్గుతుందో, పరిస్థితులు చక్కబడితే ఎంత పెరుగుతుందో అనే అంశం ఆసక్తికరం.

బడ్జెట్‌ స్వరూపం(రూ. కోట్లలో)

మరిన్ని వార్తలు