ఆ పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయం!

9 Sep, 2019 16:07 IST|Sakshi

రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావముంది

ఐనా సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగుతాయి

బడ్జెట్‌ ప్రసంగంలో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా.. సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. గత ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. 2019-20 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో సీఎం కేసీఆర్‌... మండలిలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. అనంతరం శాసనసభ... శనివారానికి శాసనమండలి బుధవారానికి వాయిదా వేశారు.
చదవండి: తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌

ప్రజాధనాన్ని వృధా చేయదలుచుకోలేదు
కేంద్ర ప్రభుత్వ పథకాలపై తమకు పూర్తి అవగాహన వుందని, ప్రజలకు మేలు చేసే..కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలకు ప్రయోజనం కలిగించని కేంద్ర పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయదలుచుకోలేదని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకంతోనే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతోందని,  ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుండగా.. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు జరుగుతుందని కేసీఆర్‌ వివరించారు. ఆరోగ్య శ్రీ కోసం ప్రస్తుత బడ్జెట్‌లో ఏడాదికి రూ. 1,336 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. 

మూలధన వ్యయం పెరిగింది!
తెలంగాణ ఏర్పాటు తర్వాత మూలధన వ్యయం పెరిగిందని, తమ ప్రభుత్వ విధానాలతో మూలధన వ్యయం పెరుగుతూ వస్తోందని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు 4.5 నుంచి 10.2 శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయిందన్నారు. ఐటీ రంగంలో 11.5 శాతం, వ్యవసాయంలో 8.1 శాతం వృద్ధి నమోదయినట్టు చెప్పారు. ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికిపైగా పెరిగిందని, పారిశ్రామిక రంగంలో అదనంగా అభివృద్ధి సాధించామన్నారు. గత ఏడాదిన్నరగా దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5 శాతం అభివృద్ధి మాత్రమే నమోదైందని కేసీఆర్‌ తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉందన్న విషయాన్ని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయని, దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం​ తగ్గిందన్నారు. 

రైతుబంధు  యథాతథంగా కొనసాగుతుంది
వాహనాల కొనుగోలులో 10.6 శాతం తగ్గుదల కనిపిస్తోందని, విమానయాన రంగంపైనా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని వెల్లడించారు. గూడ్స్‌ రైళ్ల బుకింగ్‌ కూడా తగ్గిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి పతనమైందని, డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.40కు పడిపోయిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు. మోటార్‌ వాహనాలు, ఎక్సైజ్‌ పాటు అన్ని రంగాల్లో ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నేతర వ్యయం 29 శాతం తగ్గిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టిందని వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి తెలంగాణ కంటే దారుణంగా ఉందని వెల్లడించారు. రైతు బంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని కేసీఆర్‌ స్పష్టత నిచ్చారు. 

అందుకు చింతిస్తున్నాను..!
కేంద్ర విధానాలనే రాష్ట్రాలు అనుసరించాలే తప్ప మరో గత్యంతరం లేదని, అందుకు తెలంగాణ కూడా అతీతం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టంలో ఉన్న ఈ పరిస్థితిలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చిందని చింతిస్తున్నానని అన్నారు. చేజారిపోతున్న వేల కోట్ల విలువైన భూమిపై ఇప్పుడు ప్రభుత్వానికి హక్కు వచ్చిందని, ఆ భూమిని దశల వారీగా విక్రయంచడం ద్వారా రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు