ప్రధాన హామీలు మరిచారు..

8 Mar, 2020 15:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (2020-21) పూర్తిగా అవాస్తవ బడ్జెట్‌ అని టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆర్థిక మాంద్యం అంటూ అసెంబ్లీలో అవాస్తవ బడ్జెట్‌ ప్రవేశ పెట్టారని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన మూడు ప్రధాన హామీలను బడ్జెట్‌లో ప్రస్తావించలేదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి గురించి బడ్జెట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని పొన్నాల ప్రశ్నించారు.

కొన్ని వేల ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర కాంగ్రెస్‌దేనని తెలిపారు. బడ్జెట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్ ప్రసంగంలో లో 2 లక్షల ఇళ్లు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. రాజ్యాంగ పరంగా గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు అడిగే ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఈ ఏడాది ఇవ్వలేమంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై  ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నాల డిమాండ్‌​ చేశారు.


 

మరిన్ని వార్తలు