లాక్‌డౌన్‌పై చర్చించనున్న తెలంగాణ కేబినెట్‌

29 Jun, 2020 18:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌పై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గం జూలై 1 లేదా 2న‌ సమావేశం కానుంది. గ్రేటర్‌లో కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదముందని, తక్షణమే జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించింది. (మరో 983 మందికి కరోనా)

సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇక పరిస్థితుల దృష్ట్యా నగరంలో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే ఈసారి కఠినమైన లాక్‌డౌన్‌ను విధించాలని, 15 రోజుల పాటు ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు, మందుల దుకాణాలకు మాత్రమే లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. (డాడీ.. ఊపిరాడట్లేదు!)

మరిన్ని వార్తలు