మున్సి‘పోల్స్‌’కు సిద్ధం కండి

24 Oct, 2019 04:33 IST|Sakshi

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చన నేపథ్యంలో సీఎం బుధవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సంసిద్ధతను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని వెల్లడించారు. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష లో మునిసిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు, ముఖ్యకార్యదర్శులు అరవింద్‌ కుమార్, ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.  

త్వరలోనే నగారా
త్వరలోనే పురపోరుకు నగారా మోగనుంది. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో .. వచ్చేవారం నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేయడంతో ప్రధాన అడ్డంకి తొలిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సి‘పోల్స్‌’పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం కేసీఆర్‌తో పురపాలకశాఖ అధికారులు భేటీ అయి తాజా పరిస్థితులను వివరించారు. పిల్‌ కొట్టివేసినప్పటికీ, సింగిల్‌ జడ్జి దగ్గర ఇంకా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న తరుణంలో ఎన్నికలకు ముందడుగు వేయాలా? లేదా అనే అంశంపై స్పష్ట త కోసం మున్సిపల్‌ అధికారులు సీఎంను కలిశారు.

ప్రధాన కేసు తేలినందున.. త్వరగా మిగతా కేసులు కూడా వీగిపోతాయని అభిప్రాయపడ్డ ముఖ్యమంత్రి.. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ స్పష్టమైన సంకేతాలిచిచన నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తును మొదలుపెట్టాలని పురపాలకశాఖ భావిస్తోంది. ఇప్పటికే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్ల నిష్పత్తిని నిర్దేశించినందున దానికి అనుగుణంగా సీట్ల కేటాయింపు జరగనుంది. ఇదిలావుండగా, రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ల పరిధిలో 61 లక్షల మంది బీసీ ఓటర్లున్నట్లు లెక్క తేలి్చన మున్సిపల్‌ అధికారులు ఈ వివరాలను ప్రభుత్వానికి అందించారు. బీసీ రిజర్వేషన్లు ఓటరు జాబితా ప్రకారం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన చేయనున్నారు.

మరిన్ని వార్తలు