యావత్‌ దేశానికే తెలంగాణ ఆదర్శం : కేసీఆర్‌

15 Aug, 2018 11:11 IST|Sakshi

గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్

సాక్షి, హైదరాబాద్‌ : అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, యావత్‌ దేశానికే తెలంగాణ అభివృద్ధి నమూనాను అందించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కేసీఆర్‌ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసించారని, దేశంలో అన్ని రంగాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగ పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నాం. రూ 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశాం. కల్తీలపై ఉక్కుపాదం మోపుతాం. రైతు సమస్వయ సమితులు ఏర్పాటు చేశాం. 6,028 ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశాం.

రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. తెలంగాణ ఏర్పడితే చిమ్మచీకట్లే అన్నవాళ్ల అంచనాలు తలకిందులు చేశాం. విద్యుత్‌ రంగంలో అనూహ్య ప్రగతి సాధించాం. త్వరలోనే మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణ మారబోతుంది. సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు