ఆ పార్టీల పాలనలో తెలంగాణ ఆగమైంది

11 Nov, 2018 12:52 IST|Sakshi
ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ, ఎంపీ కవిత

కాంగ్రెస్, టీడీపీల పాలనను ఎండగట్టిన డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎంపీ కవిత 

67 ఏళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదు

నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధిలో దూసుకు పోతున్న రాష్ట్రం 

ముస్లింల అభ్యున్నతికి పెద్దపీట వేశాం, గల్ఫ్‌బాధితులనూ ఆదుకున్నాం 

దేశంలో టీఆర్‌ఎస్సే సెక్యులర్‌ పార్టీ

కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎంపీ కవిత విమర్శించారు. టీఆర్‌ఎస్‌ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. గురుకుల పాఠశాలలు, షాదీ ముబారక్‌ వంటి పథకాలతో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పాటుపడినట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లకుపైగా టీఆర్‌ఎస్‌కు ఖాయమని, కాంగ్రెస్‌కు 70 పైగా సీట్లలో డిపాజిట్‌ దక్కదన్నారు.

 సాక్షి,చంద్రశేఖర్‌కాలనీ(నిజామాబాద్‌): భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో సెక్యూలర్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ మా త్రమేనని ఉప ముఖ్యమంత్రి మహ్మద్‌ మహమూ ద్‌ అలీ అన్నారు. కేసీఆర్‌తోనే మైనారిటీల సంక్షే మం సాధ్యపడుతుందన్నారు.శనివారం జిల్లా కేం ద్రం కంఠేశ్వర్‌ న్యూహౌజింగ్‌ బోర్డులోని ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో ఎంపీ కవితతో కలిసి డిప్యూటీ సీఎం విలేకరులతో మాట్లాడారు.

ము స్లింల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం లో అత్యధికంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలను టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. 65 సంవత్సరాలలో దేశాన్ని పాలించిన పాలకుల్లో ముస్లిం సంక్షేమం కోసం పాటుపడింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. షాదీ ముబారక్‌ ద్వారా లక్షకుపైగా ముస్లిం వధువుల పెళ్లిళ్లకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  నిధులు ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయని విమర్శించారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం అనైతికమన్నారు. బీజేపీతో టీఆర్‌ఎస్‌కు అవగాహన ఉందనడం వాస్తవం కాదన్నారు.

బీజేపీతో టీఆర్‌ఎస్‌ పార్టీ కలిసే ప్రసక్తే లేదన్నారు. అన్ని మతాలను సీఎం కేసీఆర్‌ ఒకే దృష్టితో చూస్తున్నారని, అన్నివర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.  రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలను ముస్లింలు నమ్మరని, బీజేపీ ప్రభావం తెలంగాణలో ఏమాత్రం లేదన్నారు. హైదరాబాద్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నా హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేవలం ఇద్దరే బీజేపీ కార్పొరేటర్‌లు గెలిచారని, దాన్ని బట్టి ఆ పార్టీ ప్రభావం ఏమాత్రంగా ఉందనేది ఇట్టే స్పష్టమవుతోందన్నారు.

కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీలతో ఏర్పడిన మహాకూటమిలో కాంగ్రెస్‌కు ఈ సారి ఎన్నికల్లో 70 నుంచి 80 సీట్లలో డిపాజిట్‌ దక్కదన్నారు. కాంగ్రెస్‌ సెక్యులరిజాన్ని నాశనం చేసిన పార్టీ అనిఆయన విమర్శించారు. గల్ఫ్‌కు వెళ్లి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబునాయుడు  తెలంగాణ ప్రాజెక్టులను ఆపడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.తెలంగాణ అభివృద్ధి చెందకుండా బాబు అడుగడుగునా కుట్ర పన్నుతున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ ప్రగతి నిరోధ పార్టీలని ధ్వజమెత్తారు. 100 సీట్లకుపైగా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఉప ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

1948 నుంచి కాంగ్రెస్‌ పాలనలో ముస్లిం రిజర్వేషన్‌ల గురించి ఏనాడు చెప్పలేదని, కాంగ్రెస్‌తో 2004లో పొత్తు పెట్టుకున్న సందర్భంగా అప్పటి రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో కేసీఆర్‌ చెప్పినప్పటికీ కూడా ముస్లిం రిజర్వేషన్‌ల విషయంలో న్యాయం చేయలేదన్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత పార్లమెంట్‌లో ముస్లింల రిజర్వేషన్‌ కోసం ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా ఆందోళన చేశారని గుర్తు చేశారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్ల కోసం కేసీఆర్‌కట్టుబడి ఉన్నారని, కచ్చితంగా అమలు చేస్తారని, పార్లమెంట్‌లో  బిల్లు పాస్‌ చేయిస్తారని, అప్పటికీ కాకపోతే సుప్రీంకోర్టు తలుపు తడతామన్నారు.

కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ ఆగమైందని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 50 ఏళ్ల కాంగ్రెస్, 17 సంవత్సరాల టీడీపీ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీలేదని,  రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని ఆ పార్టీల తీరును విమర్శించారు.ఎన్నికల ముందు ప్రజలను అయోమయం చేయడానికి ఆ రెండు పార్టీల నాయకులు చెబుతున్న కల్లబొల్లి మాటలు నమ్మవద్దన్నారు. కేవలం నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. ముస్లింల అభ్యున్నతికి కేసీఆర్‌ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.

షాదీ ముబారక్‌ వంటి అనేకసంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్‌ తర్వాత నిజామాబాద్‌ జిల్లాలోనే అత్యధిక శాతం ముస్లిం మైనారిటీలు ఉన్నారని, వీరందరిని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధకనబరుస్తోందన్నారు. గల్ఫ్‌ బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్, టీడీపీలు చేసిందేమి లేదన్నారు. 2006లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ఏర్పాటు చేసినప్పటికీ గల్ఫ్‌ బాధితులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. 2006 నుంచి 2011 వరకు ఐదేళ్ల కాలంలో ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు బడ్జెట్‌లో నయాపైసా విడుదల చేయలేదని, అదే తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2018 వరకు రూ. 100 కోట్లపైగా విడుదల చేసిందని, గల్ఫ్‌లో చనిపోయిన 1,270 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించామని వివరించారు.

జిల్లాలో వెనుకబడిన  భీమ్‌గల్‌ ప్రాంతం నుంచి సాగునీటి సదుపాయం లేక ఎక్కువ శాతం మంది యువకులు గల్ఫ్‌ వెళ్లారని, ఈ విషయాన్ని గ్రహించిన తమ ప్రభుత్వం రూ. 5 కోట్లతో గట్టుపొడిచిన వాగు నిర్మాణం చేపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తోందన్నారు. జిల్లాలో 17 మోడల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేశామని, 54 ప్రాంతాలను గుర్తించి ఉర్దూ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

తెలంగాణకు నిధులు మంజూరు చేయవద్దని, అభివృద్ధి కాకుండా చూడాలని చంద్రబాబునాయుడు 30 లేఖలను కేంద్రానికి  రాశారని ఎంపీ కవిత ధ్వజమెత్తారు.విలేకరుల సమావేశంలో అర్బన్‌ టీఆర్‌ఎస్‌  అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా, రెడ్‌క్యాప్‌ చైర్మెన్‌ ఎస్‌ఏ అలీం, టీఆర్‌ఎస్‌ నాయకులు కొటపాటి నర్సింహనాయుడు, దాదాన్నగారి విఠల్‌రావు, తారిక్‌ అన్సారీ, నగర మేయర్‌ ఆకుల సుజాత, నుడా చైర్మెన్‌ ప్రభాకర్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు