గుడ్‌న్యూస్‌: సీజ్‌ చేసిన వాహనాలు రిలీజ్‌

8 May, 2020 19:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించిన వాహనదారులకు తెలంగాణ పోలీస్‌శాఖ శుభ వార్తను అందించింది. లాక్‌డౌన్‌ కాలంలో జప్తు చేసిన వాహనాలను విడుదల చేయాలని రాష్ట్ర డీజీపీ నిర్ణయించారు. వాహనాలను భద్రపరచడం సమస్యగా మారడంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాహనాల విడుదలపై డీజీపీ మహేందర్ రెడ్డి పలు మార్గదర్శకాలను జారీ చేశారు. మోటార్‌ వెహికిల్‌ చట్టం (ఎంవీ యాక్టు) కింద జప్తు చేసిన వాహనాలకు జరిమానా విధించి యజమానులకు ఇవ్వాలని సూచించారు. ఐపీసీ, ఇతర చట్టాల కింద జప్తు చేస్తే యజమాని నుంచి బాండ్ రాయించుకని, జిరాక్స్ పత్రాలు తీసుకోవాలి తెలిపారు. (తెలంగాణలో కొత్తగా పది కరోనా పాజిటివ్‌ కేసులు)

కోర్టుల్లో కేసులకు సంబంధించిన ప్రక్రియ యథాతథంగా కొనసాగించాని డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఆంక్షలను ఉల్లంఘించిన విషయం తెలిసిందే. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1.60 లక్షల వాహనాలను సీజ్ చేసినట్టు పోలీసుశాఖ ద్వారా సమాచారం. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే లక్షకు పైగా వాహనాలు ఉన్నట్లు తెలిసింది. (దేశంలో కొత్తగా 3390 పాజిటివ్‌ కేసులు)

>
మరిన్ని వార్తలు