‘విద్యుత్‌’ నష్టాలు పైపైకి! 

7 Apr, 2018 02:34 IST|Sakshi

ఏటా పెరుగుతున్న డిస్కంల విద్యుత్‌ నష్టాలు  

2018–19లో 7,910 ఎంయూల నష్టం రూ.3,219 కోట్లకుపైనే.. 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో విద్యుత్‌ నష్టాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. డిస్కంల అగ్రిగేట్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ కమర్షియల్‌ (ఏటీ అండ్‌ సీ) నష్టాల్లో క్రమంగా భారీ పెరుగుదల నమోదవుతోంది. 2017–18లో 10.51 శాతంగా నమోదైన నష్టాలు 2018–19 నాటికి 13.27కు పెరగనున్నాయని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు నివేదించాయి. అంటే రాష్ట్రానికి సరఫరా చేసేందుకు డిస్కంలు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌లో 13.27 శాతం నష్టాల పాలవనుంది.

టీఎస్‌ఈఆర్సీ జారీ చేసిన టారీఫ్‌ ఉత్తర్వుల ప్రకారం 2018–19లో రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు 57,631.27 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కాగా.. అందులో ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ నష్టాల వాటా 7,910.48 ఎంయూలు ఉండనుంది. ఆ ప్రకారం విద్యుత్‌ కొనుగోలు యూనిట్‌కు రూ.4.07 చొప్పున నష్టాల పాలవనున్న విద్యుత్‌ విలువ రూ.3,219.56 కోట్లు. నష్టాల రికవరీ కూడా పరిగణనలోకి తీసుకుని వినియోగదారుల నుంచి వసూలు చేసే విద్యుత్‌ టారీఫ్‌ను ఈఆర్సీ నిర్ణయిస్తుంది. డిస్కంల ‘ఏటీ అండ్‌ సీ’నష్టాలు ఇలా పెరుగుతూ పోతే భవిష్యత్‌లో వినియోగదారులపై చార్జీల భారం పెరగడంతో పాటు డిస్కంలు సైతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది.  

మరిన్ని వార్తలు