తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

12 Apr, 2020 20:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో  తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి అధికారికంగా వాయిదా వేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఆదివారం ప్రకటించింది. వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్‌) వాయిదా వేసినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ను ఈనెల 30వ తేదీ వరకు పొడగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 5వ తేదీ వరకు ఆయా సెట్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ముందస్తు షెడ్యూలు ప్రకారం మే 2వ తేదీన ఈసెట్, 4, 5, 7, 9, 11 తేదీల్లో ఎంసెట్, మే 13 నుంచి పీఈసెట్, మే 20, 21 తేదీల్లో, 23వ తేదీన ఎడ్‌సెట్, 27వ తేదీన లాసెట్, 28నుంచి 31వ తేదీ వరకు  పీజీ ఈసెట్‌ నిర్వహించాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నింటిని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. మళ్లీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి ప్రకటన చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు