జానపదం మూగబోయింది..

7 Sep, 2018 15:54 IST|Sakshi
సంధ్య(ఫైల్‌)

హసన్‌పర్తి : జానపదం మూగబోయింది. 30 ఏళ్ల పాటు తన గళంతో ప్రజలను మంత్ర ముగ్ధులను చేసిన తెలంగాణ జానపద కళాకారిణి సంధ్య (50)ఇక లేరు. అనారోగ్య కారణంతో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో తుది శ్యాస విడిచారు. జానపద కళాకారుడు దివంగత శంకర్‌ భార్య సంధ్య. ప్రస్తుతం చింతగట్టు క్యాంపులోని పే అండ్‌ అకౌంట్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఎస్సార్‌ఎస్సీ క్యాంప్‌ క్వార్టర్‌లోనే ఉంటున్నారు. కుమార్తె రఘమయ్‌ బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు మింటు ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు.

2017లో సంధ్యకు ఉత్తమ జనపద కళాకారిణి అవార్డుతో సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.లక్ష పురస్కారం అందుకున్నారు. సంధ్య మృతదేహాన్ని జానపద కళాకారులు, పే అండ్‌ అకౌంట్‌ అధికారులు, ఎస్సారెస్పీ, దేవాదుల, టీఎన్జీవోస్‌ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్, పే అండ్‌ అకౌంట్‌ అధికారిణి పద్మజ, టీఎన్జీవోస్‌ యూనిట్‌ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, దేవరకొండ యాదగిరి, రాజమౌళితో పాటు నాగరి రికార్డింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సీతా రాఘవేందర్, జడల శివ, దార దేవేందర్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు