సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.