ప్రగతి పరవళ్లు 

3 Jun, 2019 09:38 IST|Sakshi
ట్రాక్టర్‌ను పరిశీలిస్తున్న నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీ సుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దాశరథి అన్నట్లుగా ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అని పేర్కొన్నారు.

ఎన్నో వనరులు, ఎంతో చారిత్రక సంపద మన వారసత్వమన్నారు. స్వపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. ఎందరో అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ.. సాధన ఘనత అమరులదేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి దేశం తెలంగాణ వైపు చూసే విధంగా చేసిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అప్పుడే మనం కలలుకంటున్న బంగారు తెలంగాణ సాధ్యం చేసుకోగలుగుతామని చెప్పారు. జిల్లాలో చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానిదే కీలక పాత్ర
జిల్లాలో 80శాతం ప్రజలు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. అందుకే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. గత ఖరీఫ్‌లో 3,81,482 మంది రైతులకు చెక్కులద్వారా రూ.421.20 కోట్లు అందించిందని తెలిపారు. రబీలో కూడా 3,60,827 మంది రైతుల ఖాతాల్లో రూ.421 కోట్ల జమ చేసిందని వివరించారు. రైతు బీమాతో మరణించిన రైతు కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందేలా చూస్తోందన్నారు. ఇప్పటికే జల్లాలో 859 మంది రైతులు మరణించగా 793.. కుటుంబాలకు రైతుబీమా అందిందని పేర్కొన్నారు.

పట్టు పరిశ్రమ
జిల్లాలో సూక్ష్మ
నీటి పారుదల పథకం ద్వారా డ్రిప్స్‌ పరికరాలపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ, సన్నకారు రైతులకు 90శాతం, పెద్ద రైతులకు 80శాతం రాయితీతో స్పింక్లర్లు ఇస్తోందన్నారు. ఉద్యాన యాంత్రీకరణ కింద 50 శాతం రాయితీపై ట్రాక్టర్‌ మౌంటెడ్‌ స్ప్రేయర్స్‌ అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రూ.6.83 కోట్లతో యూనిట్లను గ్రౌండింగ్‌ చేశామని చెప్పారు.

గొర్రెల పంపిణీ
పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నామని.. ఇందులో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇప్పటికే 26,132 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. పాడి పశువుల పంపిణీ కింద 3,618 పశువులను పంపిణీ చేయడం చేశామమని.. అందుకు రూ.29 కోట్ల వరకు ఖర్చు చేశామని తెలిపారు.

195 చెరువుల్లో చేప పిల్లల పెంపకం
మత్స్యకారులను ఆదుకునేందుకు 195 చెరువుల్లో 100 రాయితీతో 3 కోట్ల చేపపిల్లలను వదిలామ ని.. ఇప్పుడు వాటి విలువ రూ.3.41 కోట్లని పేర్కొన్నా రు. చేపలను విక్రయించేందుకు కూడా రాయితీపై వాహనాల ను అందించడంతో పాటు పరికరాలను కూడాఇచ్చామన్నారు.

పురోగతిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు జిల్లాలో పురోగతిలో ఉన్నాయని ప్రతి నియోజకవర్గానికి 1,400 చొప్పున జిల్లాలో 8,155 ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రూ.375 కోట్లతో పనులు సాగుతున్నాయని తెలిపారు.
 
మిషన్‌ కాకతీయ
చెరువుల సంరక్షణ, పునరుద్ధరణకు చేపట్టిన మిషన్‌ కాకతీయ పనులు నాలుగు దశల్లో 1360 చెరువుల్లో పూడిక తీశామని.. ఇందు కోసం రూ.530 కోట్లు పరిపాలన ఆమోదం పొంది రూ.266 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

మిషన్‌ భగీరథ
ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చేపడుతున్న మిషన్‌ భగీరథ పనులు చివరి దశకు చేరాయని.. ప్రతి మనిషికి రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 100, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు సరఫరా చేయనున్నామని తెలిపారు. అందుకోసం రూ.571కోట్లు కేటాయించామని.. ఇప్పటికే 1,467 గ్రామాలకు సురక్షిత మంచినీరు అందుతోందని పేర్కొన్నారు.

టీఎస్‌ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు అనుమతి
తెలంగాణ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత టీఎస్‌ ఐపాస్‌ ప్రవేశపెట్టి వెనువెంటనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే 224 అనుమతులు ఇప్పించామని తెలిపారు. వీటి ద్వారా రూ.165 కోట్ల పెట్టుబడులు లభించి 1,650 మందికి ఉపాధి కల్పించామని పేర్కొన్నారు.

ఏఎమ్మార్పీ 
ఏఎమ్మార్పీ కింద జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఆవాసాలకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే దాదాపు 2.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పథకానికి సంబంధించి పెండ్లిపాకల బ్యాలెన్సింగ్‌ జలాశయ నిర్మాణం, ఓపెన్‌ కెనాల్, డిండి బ్యాలెన్సింగ్‌ జలాశయం, ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం రూ.1177 కోట్ల అంచనా వేయగా రూ.694 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

డిండి ఎత్తిపోతల 
ఈ పథకం ద్వారా జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని సాగు, తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందుకోసం 7800 ఎకరాలు భూసేకరణ పూర్తయిందని.. రూ.3,930 కోట్లకు టెండర్లు పిలిచామని.. ఇప్పటికే రూ.910 కోట్లు ఖర్చు చేసి పనులను ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పేదలకు కంటి పరీక్షలు ఉచితంగా చేసి అద్దాలు కూడా అందజేస్తున్నామన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకంలో భాగంగా ఇప్పటికే రూ.19 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 17,917 మందికి వైద్య చికిత్స నిర్వహించడానికి రూ.44 కోట్లు ఖర్చు చేశానమి తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి రూ. 275 కోట్లు మంజూరయ్యాయని.. మెడికల్‌ కళాశాల త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
 
శాంతి భద్రతలు 
పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీస్‌ విధానంతో.. జనమైత్రి అమలు చేయడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, తదితర వా టిపై చర్యలు చేపట్టడంతో నేరాల నిరో«ధానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పెంచామన్నా రు. అంతకు ముందు గడియారం సెంటర్‌ వద్ద అ మరవీరుల స్తూపం వద్ద శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, కలెక్టర్, ఎస్పీ, ఇతర నా యకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎ మ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగ య్య, భాస్కర్‌రావు, ఎస్పీ రంగనాథ్, జేసీ వి.చంద్రశేఖర్, బండా నరేందర్‌రెడ్డి, డీఆర్‌ఓ రవీంద్రనా థ్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

 మార్కెటింగ్‌ 

జిల్లాలోని నకిరేకల్‌లో రూ.3.58 కోట్లతో నిమ్మ మార్కెట్‌ నిర్మాణం పూర్తయిందన్నారు. నల్లగొండ గంధవారిగూడెంలో బత్తాయి మార్కెట్‌ చేపట్టడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ధాన్యానికి మద్దతు ధర వచ్చే విధంగా పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టామన్నారు. జిల్లాలో రోడ్ల నిర్మాణానికి రూ.280 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 233 కిలోమీటర్ల రహదారి కూడా పూర్తయిందని తెలిపారు. 

కల్యాణలక్ష్మి 

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద ఆడపిల్ల పెళ్లి చేసిన పేద కుటుంబానికి రూ.1,00,116 చొప్పున 7574 మందికి రూ.75.82 కోట్లు అందించామని తెలిపారు.

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ఏర్పాటు చేయడానికి వీర్లపాలెం ఫారెస్ట్‌బ్లాక్‌లో భూసేకరణ చేసి పనులు చేపట్టామన్నారు. అందుకోసం ఇప్పటికే 1583 ఎకరాలు భూసేకరణ చేసి రూ.104 కోట్లు నష్ట పరిహారం చెల్లించామని తెలిపారు.

మరిన్ని వార్తలు