వచ్చే ఎన్నికల్లో ఇదే మా అజెండా: బీజేపీ

4 Aug, 2017 17:33 IST|Sakshi
వచ్చే ఎన్నికల్లో ఇదే మా అజెండా: బీజేపీ
హైదరాబాద్‌: సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు దీనికోసం తమ పార్టీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ సమావేశమయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 17న బహిరంగ సభ జరుపుతామని వెల్లడించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో పల్లె నుంచి ఉద్యమాలను నిర్మిస్తామన్నారు.

సీఎం కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారని, అప్పుడు పదవులకు రాజీనామా చేయాలని మంత్రులను డిమాండ్ చేశారని కానీ, ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక విమోచన దినోత్సవాలు జరుపుకుంటుండగా అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌ ఎందుకు మాట మార్చిందని నిలదీశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యం.. వచ్చే ఎన్నికల్లో ఇదే అజెండాగా ఉంటుందని వివరించారు.

కాంగ్రెస్ పాపాలను కడుగుతున్న అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్ తప్పిదాలను ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. ఇదంతా మజ్లిస్ పార్టీ మెప్పు, మచ్చిక కోసం పడే తాపత్రయమేనని తెలిపారు. రజాకార్ల మెప్పు కోసం సెప్టెంబర్ 17ను పక్కన పెట్టడం శోచనీయమన్నారు. సీఎం సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను చూసి ఆయన అభద్రతాభావంతో ఉన్నారని ఎద్దేవాచేశారు.
మరిన్ని వార్తలు