3 నెలలు.. రూ.9 వేల కోట్లు

4 Apr, 2020 02:32 IST|Sakshi

ఆరు దఫాలుగా 3 నెలల పాటు బాండ్లు, సెక్యూరిటీల వేలం

రూ.9 వేల కోట్లు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఆర్థిక సంవత్సరం మొద టి త్రైమాసికంలో బాండ్లు, సెక్యూరిటీల వేలం ద్వారా రూ.9వేల కోట్లు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం వేలంలో పాల్గొనే షెడ్యూల్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 13 నుంచి జూన్‌ 30 వరకు 6 దఫాల్లో ప్రభుత్వం ఈ నిధులను సమకూర్చుకోనుంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున రాష్ట్ర సొంత రాబడులు తగ్గిపోయిన పరిస్థితుల్లో ఆర్‌బీఐ నిర్వహించే వేలం ద్వారా సమకూరనున్న ఈ నిధులతోనే నెట్టుకురావాల్సి ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రాల వారీ షెడ్యూల్‌ 
ఆర్‌బీఐ నిర్వహించే బాండ్లు, సెక్యూరిటీల వే లం ద్వారా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు నిధులు సమకూర్చుకోనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి రూ.1,27,205 కోట్ల మేర మార్కెట్‌ అప్పులు సమకూర్చుకుంటాయని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఈనెల ఏడో తేదీ నుంచి వేలం షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో రాష్ట్రాలకు దఫాలవారీగా ఆర్‌బీఐ అవకాశం కల్పించింది.

వేజ్‌ అండ్‌ మీన్స్‌కూ అవకాశం 
ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం ప్రకారం ఓవర్‌డ్రాఫ్ట్, వేజ్‌ అండ్‌ మీన్స్‌కు వెళ్లి అప్పులు తెచ్చుకోవడం అంత సులువు కాదు. ఆర్థిక సంవత్సరంలో పరిమిత శాతంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఇలా నిధులు సమకూర్చుకునే వీలుంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్రాలు వేజ్‌ అండ్‌ మీన్స్‌ కింద తీసుకునే అడ్వాన్సులను 30 శాతానికి పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ వెసులుబాటు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు వర్తించనుంది. వాస్తవానికి, దీనిపై ఆర్‌బీఐ చైర్మన్‌ సుధీర్‌ శ్రీవాస్తవ నేతృత్వంలో ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ఇంతవరకు ఎలాంటి సిఫారసులు చేయకపోయినా, ప్రస్తుతం కరోనా  తదనంతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

మన రాష్ట్రం వేలం షెడ్యూల్‌.. సమకూర్చుకునే నిధులు

మరిన్ని వార్తలు