తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

23 Jun, 2020 19:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల (జూన్‌) పూర్తి వేతనం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో గత మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లలకు 50 శాతం వేతనాలు మాత్రమే చెల్లిస్తోంది. అయితే ఈ విషయంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం, ధర్మాసనం కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
(చదవండి : కీలక భేటీ వాయిదా.. బస్సు ప్రయాణికులకు నిరాశ)

ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడటం, జీతాలు, పింఛన్ల కోతపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ప్రతినిధుల సంబంధించి మాత్రం ఇదివరకు అమలులో ఉన్న 75శాతం కోత విధానాన్ని మరి కొంత కాలం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు