లక్ష్మి.. సరస్వతి.. పార్వతి.. 

10 Aug, 2019 02:44 IST|Sakshi

కాళేశ్వరం బ్యారేజీలకు అమ్మవార్ల పేర్లు 

నంది మేడారానికి నంది పేరు ప్రతిపాదన

వచ్చే వారం ప్రభుత్వ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంలో ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజీలకు అమ్మవార్ల పేర్లతో నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రాజెక్టు మొదటి దశలోని మొదటిదైన మేడిగడ్డకు లక్ష్మి, అన్నారానికి సరస్వతి, సుందిళ్లకు పార్వతి పేర్లను పెట్టాలనే నిశ్చయానికి వచ్చారు. దీంతోపాటే రెండో దశలో ఉన్న నంది మేడారం పంప్‌హౌస్‌కు నంది పేరును సీఎం ప్రతిపాదించగా రామడుగులోని లక్ష్మీపూర్‌కు మంచి పేరు చెప్పాలని ఇంజనీర్లకు సూచించినట్లు తెలిసింది.

దీనికి సంబంధించి గురువారం పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగానే ఇంజనీర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్‌లకు స్థానిక ప్రజల కోరిక మేరకు ఆయా ప్రాంతాల ప్రముఖ దేవాలయాలు, దేవుళ్ల పేర్లతో నామకరణం చేశారు. అంజనగిరి, వీరాంజనేయ, కురుమూర్తిరాయ పేర్లను రిజర్వాయర్లకు పెట్టారు. ఇటీవలే గట్టు ఎత్తిపోతల పథకానికి నల సోమనాద్రి పేరు పెట్టారు. అదే రీతిన కాళేశ్వరం పథకంలోని రిజర్వాయర్లకు అమ్మవార్ల పేర్లను, పంప్‌హౌస్‌లకు ఇతర దేవతల పేర్లను పెట్టాలన్నది సీఎం ఆలోచనగా ఉంది. ఈ బ్యారేజీలకు అమ్మవార్ల నామకరణానికి సంబంధించి వచ్చే వారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.   

>
మరిన్ని వార్తలు